okkadu-migiladu-first-look-poster-2సమకాలీన సినిమాలపై తన భావాలను నిర్మొహమాటంగా వెల్లడించడం ‘కుందనపు బొమ్మ’ సమంత సిద్ధాంతం. తను విమర్శించాలి అనుకుంటే… అది మహేష్ బాబు సినిమా పోస్టర్ అయినా పట్టించుకోదు, అలాగే తనకు నచ్చితే మంచు ఫ్యామిలీ పోస్టర్ అయినా సమంత పట్టించుకోదు అన్న విషయం స్పష్టమైంది. ఈ ముద్దుగుమ్మ బాటలోనే ప్రస్తుత నెంబర్ 1 హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా పయనిస్తోందన్న విషయం “ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్” ఫస్ట్ లుక్ పోస్టర్ సమయంలో స్పష్టమైంది.

అయితే వీరిద్దరూ కలిసి తాజాగా ఓ పోస్టర్ పై ప్రశంసలు కురిపించారు. మంచు మనోజ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్న “ఒక్కడు మిగిలాడు” ఫస్ట్ లుక్ పోస్టర్ పై సమంత, రకుల్ ప్రీత్ సింగ్ లు ప్రశంసలు కురిపించారు. సమంత ‘అమేజింగ్’గా ఉందంటూ కితాబివ్వగా, రకుల్ ‘ఆసం’ అంటూ అభినందనలు తెలిపింది. ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఈ భావాలకు నాని కూడా తోడై, ‘టేర్రిఫిక్ పోస్టర్ బాబాయ్’ అంటూ మంచు మనోజ్ కు ఉత్సాహాన్ని అందించాడు.

కెరీర్ లో తొలిసారి డ్యూయల్ రోల్ చేస్తున్న మంచు మనోజ్, ఒక పాత్ర ఎల్టీటీఈ టైగర్ గానూ, మరో పాత్ర స్టూడెంట్ లీడర్ గానూ కనిపించనున్నాడు. ‘యాన్ అన్ టోల్డ్ ట్రూ స్టోరీ’ క్యాప్షన్ తో విడుదలైన ఈ పోస్టర్ లో మనోజ్ ఎల్టీటీఈ టైగర్ పాత్రలో కనిపిస్తున్నారు. తుపాకీ బుల్లెట్లపై నిల్చుని ఉన్న ఈ పోస్టర్ ను నెటిజన్లు కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు. రొటీన్ సినిమాలతో సక్సెస్ రాదని తెలుసుకున్నారో ఏమో గానీ, ఈ సారి కాస్త డిఫరెంట్ గా మంచు మనోజ్ ప్రయత్నించడం ఆహ్వానించదగ్గ విషయం.