Odeon Theatres RTC X Roadsఅసలే కరోనా వల్ల దాదాపు రెండేళ్ల పాటుగా థియేటర్ల వ్యవస్థ దెబ్బ తినగా మల్టీప్లెక్స్ ల రూపంలో వాటి మీద మరింత ఎఫెక్ట్ పడేలా ఉంది. ముఖ్యంగా భాగ్యనగరంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనిపించకుండా పోయే పరిస్థితి వచ్చింది. అలా ఎందుకు అంటే ఎక్కడికక్కడ మల్టీప్లెక్స్ లు పుట్టుకురావడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తుంది. లేటెస్ట్ గా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఒడియన్ కాంప్లెస్ లో 9 స్క్రీన్లు PVR మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తుంది. ఇదేకాదు సికిందరాబాద్ ప్యాట్నీ సెంటర్ లో కూడా 11 స్క్రీన్ల మరో మల్టీప్లెక్స్ PVR ప్లాన్ చేస్తుంది. 2023 సంక్రాంతి కల్లా ఇవి రెడీ అవుతాయని చెప్పుకుంటున్నారు.

ఇప్పటికే సిటీలో చాలా చోట్ల మల్టీప్లెక్స్ నిర్మాణాలు ఎక్కువయ్యాయి. సిటీలో ఐమాక్స్, ఐనాక్స్ మల్టీప్లెక్స్ ల విస్తరణ జరుగుతుండగా మహేష్ AMB మల్టీప్లెక్స్ కూడా సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సింగిల్ స్క్రీన్స్ కు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. తెలుగు సినిమా ఏదైనా సరే మెయిన్ థియేటర్ గా అక్కడ రిలీజ్ అవుతుంటాయి. అక్కడ ఎన్నో సినిమాలు రికార్డులు చరిత్రలో నిలిచిపోయాయి. అలాంటి ప్లేస్ లో మల్టీ ప్లెక్స్ లు వస్తే రానున్న రోజుల్లో అక్కడ సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా కనుమరుగయ్యే ఛాన్స్ ఉంది.

హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కూకట్ పల్లి లాంటి ఏరియాల్లో ఇప్పటికే మల్టీ ప్లెక్స్ లతో సందడి షురూ అవుతుంది. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సికిందరాబాద్ లో కూడా మల్టీప్లెక్స్ లు వస్తే సిటీలో సింగిల్ స్క్రీన్ల పై ఆ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. రాబోయే రోజుల్లో ఇలానే మల్టీప్లెక్స్ లు ఎక్కువైతే సింగిల్ స్క్రీన్స్ అన్ని మూతపడక తప్పదని చెప్పొచ్చు. సిటీ నలుమూలల్లో మల్టీప్లెక్స్ లు ఎక్కువవుతున్న ఈ టైం లో సింగిల్ స్క్రీన్లు నడిపించడం కూడా కష్టంగానే ఉంటుంది. ఆడియెన్స్ కూడా ఒక్కసారి మల్టీప్లెక్స్ అనుభూతి పొందిన తర్వాత సింగిల్ స్క్రీన్ లకు వెళ్లడానికి ఇష్టపడరు. సో ఎలాగైనా సరే సింగిల్ స్క్రీన్లకు కష్టాలు తప్పేలా లేవు.