NTR Goes to Tirumala with Mahesh Babu's Scriptప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో “స్పైడర్” సినిమాలో నటిస్తున్న ప్రిన్స్ మహేష్ బాబు, దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో “భరత్ అనే నేను” సినిమా చేయనున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ స్క్రిప్ట్, ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ప్రయాణించింది. మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా కధతో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధం ఏంటి? అనుకుంటే… ఇక్కడే కొరటాల శివ తెరపైకి వచ్చాడు మరి.

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ సతీసమేతంగా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. అయితే జూనియర్ తో పాటు కొరటాల శివ కూడా స్వామి దర్శనం చేసుకున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కూడా కొట్టాయి. ‘బుడ్డోడు’తో ‘జనతా గ్యారేజ్’ తీసిన తర్వాత పెరిగిన సత్సంబంధాల రీత్యా కొరటాల కూడా జూనియర్ తో పాటు వెళ్లి ఉంటారని అంతా భావించిన తరుణంలో… కొరటాల వెళ్ళిన ఉద్దేశం వేరేనన్న విషయం బయటకు వచ్చింది.

తన సినిమాలు ప్రారంభం కాబోయే ముందు కధకు సంబంధించిన స్క్రిప్ట్ ను స్వామి వారి ఆశీర్వాదం నిమిత్తం దర్శనం చేసుకోవడం కొరటాలకు సెంటిమెంట్ గా మారింది. తొలి సినిమా ‘మిర్చి’తో మొదలైన ఈ ఒరవడి, ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’ల విషయంలోనూ కొనసాగింది. తాజాగా “భరత్ అనే నేను” సినిమాకు కూడా ఇదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ, జూనియర్ ఎన్టీఆర్ తో పాటు మహేష్ తో తాను తీయబోయే స్క్రిప్ట్ ను తీసుకువెళ్ళారు కొరటాల. అలా ఈ సినిమాలో జూనియర్ ను కూడా భాగస్వామ్యం చేసారు కొరటాల.