>యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో తొలి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా రికార్డులు అందుకున్న “జనతా గ్యారేజ్” ఊపు ఈ వీక్ డేస్ కాస్త తగ్గిన మాట తెలిసిందే. అయితే అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైందని సినీ వర్గాల సమాచారం. కొరటాల శివ తన గత చిత్రాల ప్రమోషన్ల మాదిరే ‘జనతా గ్యారేజ్’లో కూడా కొన్ని కొత్త సన్నివేశాలు జోడిస్తున్నట్లుగా తెలుస్తోంది.
‘మిర్చి’ సినిమా విజయవంతం అయిన రెండు వారాల తర్వాత ఒక ఫైట్ సన్నివేశాన్ని, మరియొక సీన్ ను కలిపారు కొరటాల. నిజానికి ఈ ఫైట్ సన్నివేశం మాస్ వర్గాల్లో బాగా వర్కౌట్ అయ్యింది. దీంతో ‘మిర్చి’ కలెక్షన్స్ మరింతగా పెరిగాయి. దీని మాదిరే ‘శ్రీమంతుడు’ సినిమా క్లైమాక్స్ లో కూడా ఓ రెండు సన్నివేశాలను జోడించారు కొరటాల. దాదాపు 50 రోజుల తర్వాత ఈ సన్నివేశాలు జోడించడం మరియు సదరు సన్నివేశాలలో మహేష్ లేకపోవడంతో, అప్పటికే ఆల్ టైం రికార్డులను అందుకున్న ‘శ్రీమంతుడు’కు ఇవేమీ దోహదపడలేదు.
తాజాగా ‘జనతా గ్యారేజ్’లో కూడా ఓ రెండు సన్నివేశాలను కలపాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొదటి వారంలోనే 100 కోట్లు గ్రాస్ అందుకున్న ఈ సినిమాను యంగ్ టైగర్ అభిమానులు మళ్ళీ చూసేలా సిద్ధం చేయాలనే ఉద్దేశంతో ఈ సన్నివేశాలను వీలైనంత త్వరగా జోడించాలనే నిర్ణయానికి వచ్చారట. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు గానీ, అంతకుముందు సినిమాలను పరిశీలిస్తే… సన్నివేశాలు జోడించిన తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలు మళ్ళీ జోరందుకుంటాయి.