‘జనతా గ్యారేజ్’ సినిమాపై చంద్రబాబు సర్కార్ కక్ష్య గట్టిందని, అందుకే ఏపీలో బెనిఫిట్ షోలను రద్దు చేస్తూ జీవో జారీ చేసిందని వచ్చిన వార్తలు ఒట్టి పుకార్లేనని తేలిపోయింది. గాసిప్ రాయుళ్ళకు చెక్ పెడుతూ విజయవాడలో అర్ధరాత్రి సమయంలో ‘జనతా గ్యారేజ్’ స్పెషల్ షో అనుమతులు లభించాయి. విజయవాడ, గాంధీనగర్ లో గల రాజ్ – యువరాజ్ కాంప్లెక్స్ లో ఉన్న యువరాజ్ ధియేటర్ లో సెప్టెంబర్ 1వ తేదీ మొదలవుతున్న ఘడియలలో రాత్రి 1 గంటకు ‘జనతా గ్యారేజ్’ బెనిఫిట్ షో ప్రదర్శించడానికి అనుమతులు లభించాయి.
ఈ షోకు సంబంధించిన టికెట్ల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులు హల్చల్ చేస్తున్నారు. ఈ ఉదంతంతో “జనతా గ్యారేజ్” సినిమా విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోబోవడం లేదని స్పష్టత వచ్చినట్లే. ఒక ధియేటర్ కు లభించాయంటే, ఇతర ధియేటర్లకు కూడా అనుమతులు లభించడం సులవవుతుంది. విజయవాడలో పరిస్థితులు ఇలా ఉంటే, అటు గుంటూరు పరిసర ప్రాంతమైన పెరిచర్లలో కూడా వేకువజామున నాలుగు గంటల ఆటకు అనుమతులు లభించినట్లుగా తెలుస్తోంది. తాజా పరిణామాలతో తారక్ అభిమానులు ఫుల్ హ్యాపీలో ఉన్నారు. ఇక, మిడ్ నైట్ సందడికి ‘బుడ్డోడు’ అభిమానులు సిద్ధం కావడమే తరువాయి..!
మరో వైపు మల్టీప్లెక్స్ లలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఊపందుకున్నాయి. కాస్త నెమ్మదిగా ప్రారంభమైన మల్టీప్లెక్స్ అడ్వాన్స్ బుకింగ్స్ విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వేగం పుంజుకున్నాయి. ‘జనతా గ్యారేజ్’పై భారీ అంచనాలు ఉన్న నేపధ్యంలో తొలి రోజు ‘నాన్ – బాహుబలి’ రికార్డులను అందుకుంటుందని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు. కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ – మోహన్ లాల్ కాంభినేషన్ లో ఈ ‘గ్యారేజ్’ రూపుదిద్దుకోవడమే ఈ అంచనాలకు కారణం. అలాగే ఇప్పటికే విడుదలైన దేవీశ్రీప్రసాద్ ఆడియోకు అద్భుతమైన స్పందన అభిమానులకు మరింత ఉత్సాహాన్నిచ్చింది.