సినీ హారోలపై జనం చూపిస్తున్న అభిమానంపై టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని కోలార్ లో ఇటీవల జరిగిన ఘర్షణలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల దాడిలో పవన్ కల్యాణ్ అభిమాని హత్యకు గురవ్వడం, దీనిపై పెను దుమారం రేగడం తెలిసిన విషయమే. చనిపోయిన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ ఏకంగా తిరుపతి దాకా వెళ్ళిన నేపధ్యంలో… తాజాగా ‘జనతా గ్యారేజ్’ ప్రమోషన్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
“హద్దులు దాటే అభిమానులు తనకు వద్దని” కాస్త ఘాటుగానే స్పందించాడు జూనియర్ ఎన్టీఆర్. సినీ హీరోలపై అభిమానం తప్పు కాదని చెప్పిన జూనియర్… ఆ అభిమానం హద్దులు దాటకూడదని చెప్పాడు. అభిమానం ఎల్లప్పుడూ పరిమితుల్లోనే ఉండాలని… ముందు దేశం, తర్వాత కుటుంబం, ఆ తర్వాతే సినీ హీరోలపై అభిమానం చూపాలని తేల్చిచెప్పాడు. సినీ హీరోలుగా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్… భవిష్యత్తులో కూడా ఉండబోవని కుండబద్దలు కొట్టాడు.