అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 5న శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆయనతోపాాటు పాల్గొన్న జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడి మహంత్ నృత్య గోపాల్దాస్ కు ఇప్పుడు కరోనా పాజిటివ్ అని తేలడం సంచలనంగా మారింది. ఆ కార్యక్రమంలో ఆయన మాస్క్ లేకుండా పాల్గొన్నారు.
కొద్ది రోజులుగా ఆయన శ్వాసతీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడటంతో వైద్యులు పరీక్షించగా.. కోవిడ్ సోకినట్టు పరీక్షల్లో వెల్లడయ్యింది. నృత్య గోపాల్దాస్ అనారోగ్యానికి గురయినట్టు తెలిసిన వెంటనే మథురకు యూపీలోని యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం ఓ వైద్య బృందాన్ని పంపింది. ప్రస్తుతం ఆశ్రమంలోనే ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
మరోవైపు ఆయనతో కలిసి ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పద్నాలుగు రోజులు ఐసొలేషన్ కు వెళ్లాలని డిమాండులు వినిపిస్తున్నాయి. అలాగే ప్రధానికి ముందస్తుగా కరోనా టెస్టు చేయించాలని పలువురు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. కరోనా విలయతాండవం చేస్తుండగా అట్టహాసంగా భూమి పూజ చెయ్యడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.
అయినా కేంద్ర, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లాయి. ఇది ఇలా ఉండగా… ఇప్పటికే అయోధ్యలోని ఇద్దరు పూజారులు కరోనా వైరస్ బారినపడిన విషయం తెలిసిందే. రామమందిరం వద్ద భద్రత విధుల్లో పాల్గొన్న 16 మంది పోలీసులకు కూడా వైరస్ సోకింది.