no update about sarkaaru vari paata on sankranthi“సర్కార్ వారి పాట” అప్ డేట్స్ ను అందించడంలో విఫలం అవుతోన్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థపై మహేష్ అభిమానులు ఎంత ఆగ్రహంగా ఉన్నారో తెలియాలంటే, ఓ సారి ట్విట్టర్ ను పరిశీలించాల్సిందే. కనీసం ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ తెలుపుతూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయకపోవడంతో, ఫ్యాన్స్ క్రోధం కట్టలు తెచ్చుకుంది.

సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా పోస్టర్ అప్ డేట్ ను ఇచ్చిన మైత్రీ సంస్థను, ‘సర్కార్ వారి పాట’ పోస్టర్ ను కూడా ఇవ్వాల్సిందిగా ఫ్యాన్స్ డిమాండ్ చేసారు. దీనికి రిప్లై ఇచ్చిన మైత్రీ ‘పోస్టర్ డిజైనర్స్, డైరెక్షన్ టీం, ప్రొడక్షన్ టీమ్’ అంతా కూడా కరోనా బారిన పడ్డారని వివరణ ఇచ్చుకున్నారు.

అయితే దీనిపై మహేష్ అభిమానులు ఓ రేంజ్ లో మైత్రీని ట్రోల్ చేస్తున్నారు. సుధీర్ బాబు సినిమా పోస్టర్ ను డిజైన్ చేసింది, గతంలో ‘సర్కార్ వారి పాట’ పోస్టర్ ను డిజైన్ చేసింది ‘అనిల్ అండ్ భాను’ సంస్థ అని, నిజంగా కరోనా సోకి ఉంటే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ పోస్టర్ ఎలా రిలీజ్ అయ్యింది అంటూ లాజిక్ లను వెతికి మరీ ట్రోల్ చేస్తున్నారు.

కనీసం మహేష్ ఫోటోను ఇస్తే, తామే డిజైన్ చేసుకుని రిలీజ్ చేసుకుంటాము కదా అని మైత్రీపై మండిపడుతున్నారు. అయినా సంక్రాంతి పండగ వస్తుందని ముందే తెలుసు, రెడీ చేసుకుని పెట్టుకోవాలని కూడా తెలియదా? కరోనా కారణమే అయితే ఏ రకంగా విశాఖలో ఇతర తారాగణంతో షూటింగ్ చేస్తున్నారు? అంటూ రకరకాల ప్రశ్నలతో మైత్రీని ట్యాగ్ చేస్తున్నారు.

‘సర్కార్ వారి పాట’ సినిమా ఏమో గానీ, మహేష్ అభిమానులు మైత్రీ సంస్థకు సోషల్ మీడియాలో నిజంగానే ఓ సినిమా చూపిస్తున్నారు. గత దసరా నుండి మొదలుపెట్టిన ఈ యుద్ధం తాజా సంక్రాంతి వరకు నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఇతర అగ్ర హీరోల అప్ డేట్స్ వచ్చిన ప్రతిసారి సోషల్ మీడియాలో మైత్రీ బలవుతూనే ఉంది. భవిష్యత్తులో మహేష్ తో సినిమా చేయబోయే నిర్మాతలకు ఇదొక స్ట్రాంగ్ వార్నింగ్ లా మారింది.