జగన్ ప్రభుత్వాన్ని పైపైన చూస్తేనే అనేక సమస్యలు, లోపాలు కనిపిస్తుంటాయి. మరికాస్త లోతుకు వెళ్ళి చూస్తే జగన్ ప్రభుత్వం డొల్లతనం బయటపడుతుంది.
ఇటీవల పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ళ, దాచేపల్లి, మాచవరం మూడు మండలాలోనే పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీలు సుమారు రూ.66 లక్షలు విద్యుత్ బిల్లులు బకాయిపడటంతో ఏడీఏ సియా నాయక్ అధ్వర్యంలో విద్యుత్ సిబ్బంది ఆయా కార్యాలయాలకు వెళ్ళి ఫ్యూజులు తీసేసి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఒక జిల్లాలో మూడు మండలాలలో మాత్రమే ఈ సమస్య ఉందనుకొంటే ఎవరూ వేలెత్తిచూపరు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాలలోను ఇటువంటి పరిస్థితే నెలకొని ఉండటమే ఆలోచించవలసిన విషయం.
ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి మూడు జిల్లాలలో గల అనేక ప్రభుత్వ కార్యాలయాలు , స్థానిక సంస్థలు కలిసి విద్యుత్ సంస్థలకు సర్ ఛార్జీలతో కలిపి రూ.477.99 కోట్ల రూపాయిలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. కానీ ఎన్నిసార్లు నోటీసులు పంపించినా స్పందించకపోవడంతో విద్యుత్ సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వాటికి సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లింపులు జరుగకపోతే అవి విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సొమ్ము చెల్లించలేవు. విద్యుత్ సంస్థలు బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ ఉత్పత్తి సంస్థలు బొగ్గు తదితర ఉత్పత్తులను సరఫరా చేసే సంస్థలకు బకాయిలు చెల్లించలేవు. ఈవిదంగా ఒకదాని వలన మరొకటి నష్టపోయి చివరికి అన్నీ దివాళా తీసే ప్రమాదం ఏర్పడుతుంది.
సామాన్య ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించడం రెండు రోజులు ఆలస్యమైతేనే విద్యుత్ సిబ్బంది వచ్చి ఫీజులు పీకేస్తుంటారు. అటువంటిది ప్రభుత్వ కార్యాలయాలు ఏళ్ళకు ఏళ్ళు విద్యుత్ బిల్లులు చెల్లించకుండా విద్యుత్ వాడుకొంటుంటే విద్యుత్ నియంత్రణ మండలి ఏమీ చేయలేని నిసహాయ స్థితిలో ఉంది. ఈ మూడు జిల్లాలో ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలు వసూలు చేసుకోవడానికి విద్యుత్ సిబ్బంది చేయని ప్రయత్నం లేదు. అయినా బకాయిలు వసూలు కాకపోవడంతో విద్యుత్ నియంత్రణ మండలి సెప్టెంబర్ 10వ తేదీలోగా వన్ టైమ్ సెటిల్మెంట్ కింద సర్ఛార్జ్ మాఫీ చేయాలని డిస్కంలను ఆదేశించింది.
ప్రజలు సకాలంలో పన్నులు, ఛార్జీలు చెల్లిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా మెలగాలని ఆశిస్తున్న ప్రభుత్వం మరింకెంత బాధ్యతగా వ్యవహరించాలి?కానీ ఈవిదంగా వ్యవహరిస్తూ విద్యుత్ సంస్థలకు నష్టం కలిగిస్తూ చివరకి దివాళా తీసే పరిస్థితి కల్పిస్తుండటం చాలా శోచనీయం.