no-deposit-limit-bank-income-tax-notes-exhange-banఏదైనా బ్యాంకు ఖాతాలో ఆదాయపు పన్ను పరిమితికి మించి డిపాజిట్లు చేసిన పక్షంలో జరిమానాగా 200 శాతం పన్ను మొత్తాన్ని విధిస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ ప్రభుత్వ ప్రతిపాదన ఆచరణలో మాత్రం సాధ్యం కాదని ఆదాయపు పన్ను విభాగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్లపై ఆటోమేటిక్ గా పన్ను విధించే చట్ట నిబంధన ఇండియాలో లేదని వెల్లడించారు.

“లెక్కలలో చూపని ఆదాయాన్ని పట్టుకుంటే జరిమానా విధించవచ్చు కానీ, ఎవరైనా బ్యాంకులో ఓ కోటి రూపాయలు జమ చేసి, 33 శాతం పన్ను రూపంలో చెల్లించి, 2017-18 అసెస్ మెంట్ సంవత్సరానికి, టాక్స్ రిటర్న్స్ లో చూపుతూ ‘ఇన్ కం ఫ్రం అదర్ సోర్సెస్’ అని ప్రస్తావిస్తే, సాంకేతికంగా అది స్వచ్ఛంద ఆదాయ వెల్లడేనని విశదీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిమానా వేయడానికి ప్రభుత్వానికి అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఎన్నో సమావేశాల్లో 200 శాతం జరిమానాపై చర్చించి, అది సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చామని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

అయితే ప్రభుత్వం చెప్తున్నట్లు 200 శాతం జరిమానా అంటే దాదాపుగా డబ్బు మొత్తం ప్రభుత్వానికి చేరుతుంది. వాస్తవానికి ఈ ప్రకటన వచ్చిన తరువాత అక్రమంగా నల్లధనం దాచుకున్న వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డబ్బు డిపాజిట్ చేస్తే, ఐటీ అధికారులు, సర్వీస్ టాక్స్ అధికారులు, చివరిగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తమను వేటాడుతుందని భయపడుతున్నారు. అందువల్లే తమ ఖాతాల్లోకి కాకుండా, వివిధ రకాల అక్రమ పద్ధతుల ద్వారా తమ నల్లధనాన్ని మార్చుకుంటున్నారు.

అయితే ఇపుడు కూడా ప్రభుత్వం గతంలో పెట్టిన ప్రతిపాదనను అమలు చేస్తే… ఖచ్చితంగా ఫలితాలు సానుకూలంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. నల్లధనాన్ని దాచుకున్న వారు 33 శాతం పన్నుతో బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని ఓ ప్రకటన చేసి, అలా డిపాజిట్ చేసిన వారి వివరాలు బయటకు వెల్లడించబోమని ప్రకటిస్తే, నల్లధనంలో అత్యధిక మొత్తం వ్యవస్థలోకి వచ్చేస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఈ నోట్ల మార్పిడి “వ్యాపారం” దేశంలో జరుగుతుందని మీడియా వర్గాలు ఘోషిస్తున్నాయి.