No cash boards back at Bank  ATMsఓ వైపు నెల రోజులుగా తెరచుకోని ఏటీఎంలు… మరో వైపు బ్యాంకుల్లో నిండుకున్న నగదు నిల్వలతో ఖాతాదారులు చేతిలో డబ్బులు లేక లబోదిబోమంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత ఏర్పడిన పరిస్థితే లేటెస్ట్ గా మళ్ళీ పునరావృతం కావడం విశేషం. హైదరాబాద్ వంటి నగరాల్లో గడచిన నెల రోజులుగా 80 శాతం ఏటీఎంలు తెరచుకోలేదంటే, పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదే సమయంలో బ్యాంకుల్లో నగదును విత్ డ్రా చేసుకునేందుకు వెళ్లిన వారికి సైతం ‘నో క్యాష్’ బోర్డులు కనిపిస్తున్నాయి. డబ్బులు ఉన్న బ్యాంకుల్లో విత్ డ్రాపై ఆంక్షలను అమలు చేస్తున్నారు. బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రాపై అమలులో ఉన్న ఆంక్షలన్నింటినీ రిజర్వ్ బ్యాంక్ ఎత్తివేసినప్పటికీ, 30 వేలకు మించి ఇచ్చే పరిస్థితి లేదని బ్యాంకు అధికారులు చేతులెత్తేస్తున్నారు.

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుండి కొత్త కరెన్సీ రావడం లేదని, భవిష్యత్తులో నగదు కష్టాలు మరింతగా పెరుగుతాయని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. కాగా, బ్యాంకుల నుంచి ఖాతాదారులకు చేరిన కొత్త కరెన్సీ, ముఖ్యంగా మార్కెట్లోకి వెళ్ళిన 2 వేల నోట్లు తిరిగి డిపాజిట్ లకు నోచుకోకపోవడంతో, సదరు మొత్తం సర్క్యూలేషన్ లోకి రాకపోవడమే ఈ మొత్తం సమస్యకు కారణమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.