‘ఎంతటి స్టార్ హీరోల సినిమాలైనా తన పాత్ర నటించడానికి అవకాశం లేకపోతే ఒప్పుకునేది లేదని’ పలు సందర్భాలలో నిర్మొహమాటంగా చెప్పిన కేరళ కుట్టి నిత్యామీనన్, ‘జనతా గ్యారేజ్’ రూపంలో మొదటిసారిగా ఓ అగ్ర హీరో సరసన నటించడానికి ఒప్పుకుంది. ‘ఈ సినిమాలో తనకు ఎంతో ప్రాధాన్యత గల పాత్ర లభించిందని, తొలిసారిగా ఓ అగ్ర హీరో సరసన నటిస్తున్నానని, ఓ కమర్షియల్ సినిమాలో నటించాలన్న తన ఆకాంక్ష తీరిపోయిందని’ చెప్పుకొచ్చింది.
అక్కడ నుండి కట్ చేసి, సినిమా విడుదలైన తర్వాత స్పందన చూస్తే… అసలు ఏ మాత్రం ప్రాధాన్యత లేని రోల్ ను నిత్యామీనన్ ఎందుకు ఎంపిక చేసుకుందా? అన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. తన కెరీర్ లో ఇప్పటివరకు దేనికైతే ప్రాధాన్యతనిచ్చిందో ‘జనతా గ్యారేజ్’లో అందుకు విరుద్ధంగా ఉండడం విశేషం. బహుశా క్లైమాక్స్ లో ఎన్టీఆర్ కు సతీమణిగా సమంత కాకుండా నిత్యామీనన్ మిగిలి పోతుందన్న ఒకే ఒక్క కారణం కోసం ఈ పాత్రను అంగీకరించిందేమో అన్న భావన ప్రేక్షకులకు కలుగుతోంది.
ఫస్టాఫ్ లో ఓ నాలుగు సీన్లు, ఒక పాట, సెకండాఫ్ లో ఓ మూడు సీన్లకు పరిమితమైన ఇలాంటి హీరోయిన్ పాత్రలు తెలుగు సినిమాలకు కొత్త కాదు గానీ, నిత్యామీనన్ ఎంపిక చేసుకోవడమే ఆశ్చర్యానికి గురి చేసే అంశం. బహుశా ‘తానూ కమర్షియల్ సినిమాలను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను’ అన్న సంకేతాలను సినీ వర్గాలకు పంపించడానికి ఈ అంగీకరించిందేమో..! సినిమాల ఎంపిక విషయంలో ‘పొట్టి పిల్ల అయినా చాలా గట్టి పిల్ల’ అన్న టాక్ సంపాదించుకున్న నిత్యామీనన్ ఆలోచనలు కాస్త మెత్తబడ్డాయేమో..!?