‘జనతా గ్యారేజ్’ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఒక్కొక్కరు తమ అభిరుచులు పంచుకుంటుండగా, ఈ జాబితాలోకి నిత్యా మీనన్ కూడా చేరింది. ఇందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ చెప్పిన పలు సంగతులు… తన సహచర నటి సమంతతో తనకు అస్సలు ఇబ్బంది తలెత్తలేదని, తాను- సమంత మంచి స్నేహితులమని, తాము ప్రధానంగా గాసిప్స్ గురించి చర్చించుకుంటామని తెలిపింది. తనపై పెద్దగా గాసిప్స్ ఉండవు కనుక…అందరి గాసిప్స్ గురించి చెప్పుకుని నవ్వుకుంటామని చిరునవ్వులు చిందించింది.
దేశంలోని అద్భుతమైన నటుల్లో మోహన్ లాల్ ఒకరని, ఆయన కళ్లు తీక్షణంగా ఉంటాయని, అవే సగం డైలాగుల్ని చెప్పేస్తాయని, ఆయనతో నటించడం గర్వకారణంగా ఉందని, అలాంటి వ్యక్తితో నటించడం వల్ల నటన ఎంతో మెరుగవుతుందని ఆమె పేర్కొంది. ఇక, జూనియర్ ఎన్టీఆర్ తో నటించడం ఆనందంగా ఉందని, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఏదైనా విషయం చెబితే దానిపై మంచి ఇంపాక్ట్ ఉంటుందని ‘బుడ్డోడు’ గురించి చెప్పిన నిత్యా, ఈ సినిమా కోసం చిత్రీకరించిన తొలి షాట్ ను గుర్తు చేసుకుంది.
ముంబైలో తమ మధ్య తొలిషాట్ చిత్రీకరణ జరిపే సమయంలో… డైలాగ్ చెప్పడానికి ముందు… ‘నేను నీ అభిమానిని, నువ్వు బాగా నటిస్తావని’ జూనియర్ ఎన్టీఆర్ తనకు కితాబిచ్చారని, తమ మధ్య మంచి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడిందని, ఇది సినిమాలో సులువుగా నటించేందుకు ఉపయోగపడిందని తెలిపింది. ఈ సినిమా అభిమానులపై మంచి ప్రభావం చూపుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన నిత్యామీనన్, దీనికి కారణం మాత్రం కొరటాల శివ అందించిన కధగా పేర్కొంది. కొరటాల శివ కథ, కథనం ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయని, ఎలాంటి అంశాన్నైనా సరళంగా చెప్పడంలో కొరటాల శివది ప్రత్యేకశైలి అని ఈ కేరళకుట్టి “జనతా గ్యారేజ్” విశేషాలను చెప్పుకొచ్చింది.