కరోనా విజృంభించాకా టాలీవుడ్ హీరోలందరూ తమ ఇళ్లకే పరిమితం అయిపోయారు. తమ కుటుంబాలతో ఈ సమయాన్ని గడపడానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలలోనూ, ఇటు సినిమాలలోనూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నా ఆయన కూడా హైదరాబాద్ లోని తన ఇంటికే పరిమితం అయిపోయారు.
అయితే తొందరలో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే అవకాశం ఉందట. ఈ నెల 26న ఒక ప్రైవేట్ రిసార్ట్ లో జరగబోతున్న నితిన్ వివాహానికి ఆయన హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈరోజో రేపో నితిన్ వెళ్లి ఆయనను స్వయంగా ఆహ్వానిస్తాడట. నితిన్ పవన్ కళ్యాణ్ పెద్ద అభిమాని కావడంతో జనసేనాని కాదని అనకపోవచ్చు.
ఇది ఇలా ఉండగా…ఈ ఏడాది ఫిబ్రవరిలో నితిన్, షాలిని పసుపు కుంకుమ వేడుక జరిగిన విషయం తెలిసిందే. అసలైతే ఈ పెళ్లిని అంగరంగ వైభవంగా జరపాలని నితిన్, షాలినిల ఇరు కుటుంబ సభ్యులు తలచారు. కానీ కరోనా రూపంలో వారి పెళ్లి సాధారణంగానే జరగబోతోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నితిన్ ‘రంగ్ దే’, ‘చెక్’ అనే రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘అంధాధున్’ రీమేక్, కృష్ణచైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ సినిమాలు చేయనున్నారు. కరోనా కారణంగా షూటింగులు లేకపోవడంతో పెళ్ళైన జంటకు ఎక్కువ కాలం ఏకాంతం దొరికే అవకాశం ఉంది.