ప్రముఖ సినీ నటుడు నితిన్ కు విశాఖపట్టణంలోని సింహ్రాద్రి అప్పన్న సన్నిధిలో చేదు అనుభవం ఎదురైంది. ‘ఛల్ మోహన రంగ’ సినిమా విడుదలకు ముస్తాబవుతున్న నేపథ్యంలో సింహాద్రీశుని ఆశీర్వాదం తీసుకుందామని నితిన్ సింహాచలం వచ్చాడు. ఆలయంలో నితిన్ ను తాళ్లతో బంధించిన ఆలయ అలంకారి కరి సీతారామాచర్యాలు నేరుగా స్థానాచార్యుడు టి.పి.రాజగోపాల్ వద్దకు తీసుకెళ్లారు.
ఆయన నితిన్ తో ‘ఏమండీ… చాలా సినిమాల్లో హీరోగా నటించి పేరు తెచ్చుకున్నారు.. పైగా బాగా స్థితిమంతులు. అలాటి మీరు స్వామి వారి ఉంగరాన్ని చోరీ చేశారంటే నమ్మశక్యం కాకుండా ఉంది. మర్యాదగా ఇచ్చేయండి…’ అంటూ దొంగతనం మోపారు. దీంతో బిత్తరపోయిన నితిన్… ‘నేను తియ్యలేదండి కావాలంటే చెక్ చేసుకోండి…’ అంటూ సమాధానమిచ్చాడు.
‘శనివారం రాత్రి స్వామివారి ఉంగరం పోయింది. చోరులెవరో కనిపెట్టే పనిలో ఉన్నాం. మాకు ఉంగరం దొరికే వరకు మీరు బందీలుగా ఉండాల్సిందే’ అంటూ స్థానాచార్యుడు హుకుం జారీ చేశారు. దీంతో నితిన్ అలాగే ఉండిపోయారు. ఆ తరువాత మరికొంత మందిని కరి సీతారామాచార్యులు బంధించి తేవడం, రాజగోపాల్ ప్రశ్నించడం జరిగింది. ఈ తతంగాన్ని అక్కడే ఉన్నవారంతా నవ్వుతూ వీక్షించారు.
అయితే దొంగతనం మోపబడిన పలువురు భక్తులు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో ఆలయాధికారులు వారిని ఓదార్చుతూ, సింహగిరి వరాహ లక్ష్మీనృసింహస్వామివారి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా చివరి రోజు వినోదోత్సవంలో భాగంగా నిర్వర్తించిన కార్యక్రమమని, అయ్య వారి ఉంగరం దొరికిందని చెప్పారు. దీంతో అంతవరకు దొంగతనం మోపబడి, ఏడ్చిన భక్తులంతా నవ్వుకున్నారు.
అప్పన్న కళ్యాణోత్సవంలో ఆరో రోజు రాత్రి దొంగలదోపు ఉత్సవం నిర్వహిస్తారు. ఇందులో ఉభయ దేవేరులతో విహారయాత్రకు వెళ్లిన స్వామి వారి ఉంగరం కనిపించకపోవడంతో… ఉంగరం ఉంటేనే రావాలని అమ్మ వారు షరతు విధించి అలుగుతుంది. దీంతో స్వామి మర్నాడు ఉదయం ఉంగరాన్ని వెతుక్కునే పనిలో పడతారు. తన తరపు దూతగా వైదికుల్లో ఒకరిని నియోగించి, భక్తులను తాళ్లతో బంధించి తీసుకొచ్చి ప్రశ్నింపజేస్తారు. ఇందులో భాగంగానే నితిన్ పలువురు భక్తులు దొంగలుగా మారారు.