డబుల్ హ్యాట్రిక్ ను పూర్తి చేసిన ‘నాచురల్ స్టార్’ నాని, మరో హ్యాట్రిక్ కు “నిన్ను కోరి” సినిమా ద్వారా శ్రీకారం చుట్టడానికి జూలై 7వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ విడుదలై వీక్షకుల నుండి ప్రశంసలు అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. తాజాగా ఈ సినిమా ఆడియో ఫుల్ ఆల్బమ్ ను యూ ట్యూబ్ లో విడుదల చేసారు.

నానికి ఇప్పటికే ‘భలే భలే మగాడివోయ్, మజ్ను’ సినిమాలకు సంగీతం అందించిన గోపి సుందర్ స్వరపరిచిన ఈ ఆడియోలో మొత్తం నాలుగు పాటలున్నాయి. ఇప్పటికే ‘అడిగా అడిగా…’ మరియు ‘ఉన్నట్టుండి గుండె… వంద కొట్టుకుందే…’ అనే రెండు పాటలను విడుదల చేయగా, సంగీత, సాహిత్య ప్రియులను మెస్మరైజ్ చేయడంలో విజయవంతం అయ్యాయి. ఇక మిగిలిన ఆ రెండు పాటలు కూడా సంగీత ప్రియులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాయనే చెప్పవచ్చు.

ఆల్బమ్ లో వినగానే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే విధంగా ‘ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే’ పాట నిలుస్తుంది. కార్తీక్, చిన్మయి స్వరం ఈ పాటకు ప్లస్ పాయింట్స్ కాగా, ఇటీవల కాలంలో హిట్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న రామజోగయ్య శాస్త్రి సాహిత్యం వినగానే ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పటికే శ్రీరామ్ ఆలపించిన ‘అడిగా అడిగా’ అనే పాట చార్ట్ బస్టర్స్ లో టాప్ స్థానంలో మారుమ్రోగుతూ ప్రేక్షకులను అలరిస్తోంది.

ఆల్బమ్ లో మూడవ పాటగా వినిపించే ‘వన్స్ అప్ ఆన్ టైంలో… వైజాగ్ బీచ్ రోడ్డులో…’ యూత్ కు వెంటనే కనెక్ట్ అవుతుంది. బ్రేకప్ పాటగా క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ పాటకు భాస్కరభట్ల వినసొంపైన సాహిత్యాన్ని అందించగా, అరుణ్ గోపాన్ గాత్రం చేసారు. చివరి పాటగా వినిపించే విరహ గీతం ‘హే బదులు చెప్పవే…’ పాటను హరిచరణ్ పాడగా, అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు.

మొత్తమ్మీద “నిన్ను కోరి” ఆడియో ఆల్బమ్ ఒక ‘ఫీల్ గుడ్’ అనుభూతులను పంచుతుంది. ముఖ్యంగా ప్రేమ జంటలకు, యువతరానికి బాగా కనెక్ట్ అయ్యే విధంగా పాటలు ఉన్నాయి. సాహిత్యాన్ని ఎలివేట్ చేసే విధంగా గోపి సుందర్ సంగీతం స్లోగా ఉన్నప్పటికీ, వినగానే ‘ఇరిటేషన్’ లేకుండా వినసొంపుగా ఉందన్న టాక్ ను సొంతం చేసుకుంటుంది. మొత్తమ్మీద “నిన్ను కోరి” ఆడియో సూపర్ హిట్ గా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు.