NIBIRU conspiracy theorists believe Planet X hits earthభూమి అంతరించిపోయే రోజు ఇదేనని గతంలో చాలా తేదీలనే ప్రకటించారు. ఆ తర్వాత అవి నవ్వులపాలైన విషయం తెలిసిందే. ఇలా ప్రతిసారి భంగపాటుకు గురవుతున్నా, ఇలాంటి ప్రకటనలకు మాత్రం ఎక్కడా కొదవలేదు అనిపించే విధంగా వస్తున్నాయి. మరోసారి ప్రజలందరినీ కాసేపు నవ్వించేందుకు మరో ప్రకటన వెలువడింది. ‘డూమ్స్ డే’ సిద్ధాంతకారుడు డేవ్ మీడ్ లేటెస్ట్ గా చేసిన ప్రకటనలో… భూమి నాశనమయ్యే కొత్త తేదీ ఈ నెల 15గా నిర్ణయించారు. అయితే ఈ సారి ఒక్కరోజులోనే అంతా జరిగిపోదంట. క్రమక్రమంగా వచ్చే ఏడు సంవత్సరాలలో ఈ భూమి అంతమవుతుందని చెప్తున్నారు.

మరో వారం రోజుల్లో నాంది పలకనున్న ఈ ఉదంతంలో… నిబిరు గ్రహం లేదా ప్లానెట్ ఎక్స్ భూమిని ఢీకొంటుందని, దీంతోపాటు ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని హెచ్చరించారు. 15వ తేదీతో మొదలై… వచ్చే ఏడేళ్లలో భూమి నామరూపాల్లేకుండా అంతమై పోతుందని, ఈ ఏడేళ్లూ మానవాళి నరకయాతన అనుభవించాల్సిందేనని అన్నారు. ప్రతి ఒక్కరూ మరణించే ముందు ఎంతో కష్టపడతారని చెప్పారు. అమెరికా, కరేబియన్ దీవుల్లో వచ్చిన వరదలు, మెక్సికోలో సంభవించిన భూకంపం వంటివి భూమి నాశనానికి సంకేతాలేనని చెప్పారు. వీటన్నింటికీ తోడు అణు విపత్తులు వస్తాయని, యుద్ధం కారణంగా అణుబాంబులు పడి సర్వనాశనానికి నాందిగా మారుతుందని తెలిపారు.

రష్యా, చైనా, ఇరాన్, నార్త్ కొరియా ఓ వైపు, అమెరికా, బ్రిటన్ మరోవైపు నిలిచి పోరాడతాయని అంచనాలు వేసి చెప్పారు. అయితే గత నెల 23న నిబిరు భూమిని తాకుతుందని డేవ్ మీడ్ చెప్పినా అది జరగలేదన్న సంగతి తెలిసిందే. గత నెలలో తాను చిన్న తప్పు చేసి అక్టోబర్ 23ను అంచనా వేశానని చెప్పిన డేవ్ మీడ్, ఈసారి తన మాటలు నిజమవుతాయని అంటున్నారు. తన వ్యాఖ్యలకు ఉదాహరణగా, ఆగస్టు 21న సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణం తరువాత వరుస ఘటనలు ఎన్నో జరిగాయని డేవ్ మీడ్ గుర్తు చేశారు. ఇలాంటి వార్తలు ఒకప్పుడు అయితే సంచలనంగా ఉండేవి గానీ, ప్రస్తుతం కామెడీగా మారిపోయాయి.