బిజూ జనతాదళ్ ఏ కూటమిలోనూ చేరబోదని ఆ పార్టీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. భాజపా, కాంగ్రెస్లకు సమాన దూరంలో ఉన్న తమ పార్టీ ఇతర పార్టీలతో జట్టు కట్టే అవకాశం లేదని తేల్చి చెప్పారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ తో జత కట్టమంటే ఇంక ఆయన ఫెడరల్ ఫ్రంట్ అని తెరాస అభిమానులు సంబరాలు చేసేసుకుంటున్నారు. కేసీఆర్ కాంగ్రెస్సేతర బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ లో చేరినట్టే అని సంబరాలు చేసేసుకుంటున్నారు.
బిజూ జనతాదళ్ ఎప్పుడూ కాంగ్రెస్ బీజేపీలకు ఒకింత దూరంగానే ఉంటుంది. అవసరం మేరకు ఆ పార్టీ జాతీయ స్థాయిలో అంశాల వారీగా అధికార పార్టీలకు మద్దతు ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా పలు అంశాలలో ఆ పార్టీ మద్దతు ఇచ్చింది. ఆ రెండు పార్టీలు ఒడిశాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు గా ఉండడంతో వాటికి దూరంగా ఉన్నట్టు నవీన్ పట్నాయక్ ప్రకటించారు. దీనిలో కొత్తగా దేశరాజకీయాలలో ఒక వెలుగు వెలుగుదామని చూస్తున్న కేసీఆర్ సాధించిన విజయం ఏంటో మరి.
ఒడిశా ముఖ్యమంత్రి బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు అధికారంలో ఉన్నారు. అయినా ఇప్పటికీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆ పార్టీకే మెజారిటీ సీట్లు అని సర్వేలు చెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఒడిశా కూడా ఎన్నికలకు వెళ్ళబోతుంది. ఈ క్రమంలో జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో వారికి చోటు కలిపించలేరు నవీన్ పట్నాయక్. దీనితో ఎప్పటి లానే జాతీయ పార్టీలకు సమదూరం అని ప్రకటించేశారు ఆయన.