డ్రగ్స్ కేసులో షుమారుగా 11 గంటల పాటు విచారణను ఎదుర్కొన్న హీరో నవదీప్, మునుపటి సెలబ్రిటీల మాదిరి ముభావంగా కాకుండా చాలా ఉల్లాసంగా కనిపించారు. బహుశా తనలో దాచుకున్నది మొత్తం సిట్ ముందు పెట్టారో లేక విచారణ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిందో గానీ, బయటకు వచ్చిన నవదీప్… ‘తన దగ్గర ఉన్న సమాచారం స్పష్టంగా చెప్పాను, మళ్ళీ తనను రమ్మని అయితే చెప్పలేదు గానీ, అవసరమైతే ఫోన్ చేస్తామని అన్నారు’ అంటూ మీడియాకు బదులిచ్చి వెళ్ళిపోయారు.
అలా మీడియాకు ఓ రెండు ముక్కలు చెప్పాడం, ఆ తర్వాత తమ ఆవేదనను వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేయడం ఈ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ తర్వాత సెలబ్రిటీలు రెగ్యులర్ గా చేస్తోన్న విషయాలు. దీంతో నవదీప్ ఎలాంటి వీడియోతో ప్రేక్షకుల ముందుకు వస్తారో అని భావించగా, ‘తనపై నమ్మకం పెట్టుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ… ఇక్కడ నుండి ముందుకెళ్ళాల్సిన ఆవశ్యకత ఉందంటూ’ ట్విట్టర్ వేదికగా సిట్ విచారణ తర్వాత తన భావాలను వ్యక్తపరిచారు.
ఇక ఆ తర్వాత ఎప్పటి మాదిరిగా ఉదయాన్నే దగ్గుపాటి రానా “నేనే రాజు నేనే మంత్రి” సినిమాకు సంబంధించిన పోస్టర్ ను పోస్ట్ చేసి ‘రెడీ టు ఫైర్’ అని మరో ట్వీట్ చేసారు. అయితే డ్రగ్స్ విచారణ అనంతరం ‘రెడీ టు ఫైర్’ అని చెప్పడం వెనుక ‘డబుల్ మీనింగ్’ ఏమైనా ఉందా..? లేక సింగిల్ స్ట్రైట్ మీనింగేనా..? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశాన్ని చాలాకాలం నుండి నవదీప్ పోస్ట్ చేస్తుండడంతో, ఇది సంచలనంగా మారలేదు. లేదంటే నవదీప్ ట్వీట్ పెద్ద కలకలమే రేపేది!