ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన నాలుగైదు పిటిషన్లను విచారణకు తీసుకుని ఎన్జీటీ ఈ రోజు తుదితీర్పు వెలువరించింది. అమరావతిలో పర్యావరణానికి హాని కలిగిస్తున్నారన్న పిటిషనర్ల అభ్యంతరాలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది.
అదే సమయంలో పర్యావరణ శాఖ విధించిన 191 నిబంధనలను కచ్చితంగా అమలుచేస్తూనే నిర్మాణాలు సాగాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. కొండవీటి వాగు దిశ మార్చినా ప్రవాహానికి ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలని ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
కృష్ణా నది పరిరక్షణ చర్యలు చేపట్టాలని, ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని ఆదేశించింది. అదే సమయంలో రెండు కమిటీలను నియమించింది. ఈ కమిటీలు అమరావతిలో నిర్మాణాలను పర్యవేక్షిస్తాయి, అమరావతిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ట్రిబ్యునల్ కి చేరవేస్తుంటాయి.