గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు అడుగడుగునా ప్రజలు నిలదీస్తుండటంతో సహనం కోల్పోయి ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో వైసీపీ పరిస్థితి వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్నట్లవుతోంది. ఈ కార్యక్రమం ద్వారా తమ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పధకాల గురించి ప్రజలకు మరోసారి గుర్తుచేసి, వారిని పార్టీ చేజారిపోకుండా కాపాడుకోవాలని ఆశించింది.
అయితే ప్రజాప్రతినిధులమైన తమకు ప్రజలందరూ కూడా తమ అనుచరులు, పార్టీ కార్యకర్తల మాదిరిగానే వినయంగా, విధేయంగానే ఉండాలనే బలమైన భావన కలిగిన వైసీపీ నేతలకి ఈ ప్రజాగ్రహం తట్టుకోలేక వారు కూడా ప్రజలపై తిరగబడుతుండటంతో పరిస్థితి తారుమారు అవుతోంది.
నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ ఈరోజు అనకాపల్లి జిల్లా, నాతవరం మండలంలోని పెదగొలుగొండపేట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు తమ సమస్యల గురించి ఎమ్మెల్యేకు ఏకరువు పెట్టబోతుంటే వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకొన్నారు. దాంతో గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం చెపుతూ వారిని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మద్య తీవ్ర వాదోపవాదాలు జరిగి తోపులాటలు జరగడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
దాంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే గణేశ్, “మీరంతా అయ్యన్న పాత్రుడు తాలూకే కదా?దమ్ముంటే అతనిని నా ముందుకు రమ్మని చెప్పండి. గుడ్డలూడదీసి కొడతాను. నేను తలుచుకొంటే అతను ఇంటికి కూడా వెళ్ళలేడు… అంటూ చేతిలో మైక్ ఉందనే సంగతి కూడా మరిచిపోయి ఆవేశంతో బూతులు అందుకొన్నారు.
వైసీపీ నేతలు గడప గడపకూ ఇలాగ ప్రజలతో ఘర్షణ పడుతుంటే, వైసీపీని మరెవరూ ఓడించనక్కరలేదు. కాగల కార్యం గంధర్వులే చేస్తారన్నట్లు వారి పార్టీని వారే ఓడించుకొంటారేమో?