ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికల సభకు ఈరోజు రానున్నారు ఈ క్రమంలో ఆయన ఏపీ రాజకీయాలపై ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎపిలో ఓడిపోతుందని నమ్ముతున్నానని ఆయన అన్నారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇవ్వాళ మళ్లీ ఎపి టూర్ కు వెళుతున్నానని, రాజమండ్రి సభలో మాట్లాడతానని ఆయన చెప్పారు.ఎపి ప్రజలు టిడిపి ప్రభుత్వ అవినీతితో విసిగిపోయారని ఆయన అన్నారు.
ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబుతో చెట్టపట్టాలు వేసుకుని తిరిగి ఇప్పుడు ప్లేటు ఫిరాయించడం విశేషం. సరే ఆ విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీతో విసిగిపోయారు. మార్పు కోరుకుంటున్నారు సరే మరి ఆ మార్పు ఎవరు ఇవ్వబోతున్నారు? మాట వరసకు కూడా ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు అని చెప్పలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉంది పార్టీ ఈ రాష్ట్రంలో. అటువంటి సందర్భంలో టీడీపీని ఆక్షేపించడం ఏదైతే ఉందొ… బీజేపీ అద్వాన్న పరిస్థితికి అద్దం పడుతుంది.
సీనియర్ నేతలు అని చెప్పుకునే సోము వీర్రాజు వంటి వారు కూడా పోటీ చెయ్యలేను అని తప్పించుకోవడమే ఇందుకు నిదర్శనం. ఎన్నికలలో బీజేపీ అటు శాసనసభలో గానీ పార్లమెంట్ లో గానీ ఖాతా తెరవలేని పరిస్థితి. ఆ మాట అటుంచితే అసలు కనీసం గుప్పెడు సీట్లలో కూడా డిపాజిట్లు తెచ్చుకోలేని పరిస్థితి. ఏదో చంద్రబాబును తిట్టి పోసి రహస్యమిత్రులకు తోడ్పడాలి అనే ఉద్దేశమే తప్ప ఇప్పుడు ప్రధాని రాష్ట్రానికి రావడం కూడా టైమ్ వేస్ట్ అనే చెప్పుకోవాలి.