గత రెండున్నర్ర సంవత్సరాలుగా దేశానికి నరేంద్ర మోడీ చేసిందేమీ లేదు, ఒక్క మాటలు చెప్పడం తప్ప..! అంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అవకాశం చిక్కినప్పుడల్లా ప్రధాని మోడీని ఏకిపారేసే పనిలో ఉంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆధార్ కార్డుపై విమర్శలు చేసి, ప్రస్తుతం అదే కార్డును ‘ఖచ్చితం’ చేయడం మరియు మన్మోహన్ క్యాబినెట్ చేసిన ‘ఎఫ్.డి.ఐ’ నిర్ణయాన్ని అప్పట్లో వ్యతిరేకించి, ఇప్పుడు దానినే అమలు పరచడం… ఇలా ఏ విషయం తీసుకున్నా కాంగ్రెస్ నే అనుసరిస్తున్నారు… అయితే మాటలలో మాత్రం ‘మంత్రాలు’ చూపిస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు కూడా పలు సందర్భాలలో మోడీ మాటలను ప్రస్తావించారు.
అయితే అంతటి మాటల మాంత్రికుడు, ఆదివారం తెలంగాణాలో జరిపిన పర్యటనలో తడబడడం విశేషం. తెలుగు నేల మహిమో లేక ప్రజలను అమితంగా ఆకట్టుకోవాలన్న తపనో గానీ, ఓ రెండు తప్పులు మోడీ ప్రసంగంలో వినిపించడం విశేషం. గజ్వేల్ కు వచ్చి కోమటిబండలో “మిషన్ భగీరథ” ఫలాలను ప్రజలకు అందించిన తరువాత జరిగిన బహిరంగ సభలో… తమ రాష్ట్రాల్లో పంట పొలాల కోసం ఎరువులు కావాలని రాష్ట్రాలు ఏకరువు పెడుతుండటాన్ని ప్రస్తావించిన సందర్భంలో…
‘నేను ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి..’ అని ప్రస్తావించడానికి బదులు ‘నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి…’ అని తడబడ్డారు. అలాగే ఇండియాకు స్వాతంత్రం వచ్చిన నెల రోజులకు హైదరాబాద్ కు విముక్తి కలిగిందని చెప్పి తప్పులో కాలేసారు. వాస్తవానికి ఆగస్టు 15, 1947న స్వతంత్ర భారతావని ఉద్భవించిన 13 నెలలకు సెప్టెంబర్ 17, 1948లో (తెలంగాణా విమోచన దినం) ఆనాటి భారత సైన్యం నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన సంగతి తెలిసిందే.