కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఇందుకు ఆయా సందర్భాల్లో చోటు చేసుకున్న ఘటనలు కారణాలుగా నిలుస్తున్నాయి. తాజాగా గుజరాత్ లో గోవు మాంసం తిన్నారన్న కారణంగా దళిత యువకులపై జరిగిన దాడి… ఆ పార్టీ గట్టి పట్టున్న గుజరాత్ లోనూ ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి.
ఇప్పటికిప్పుడు ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే… బీజేపీ అధికారం కోల్పోతుందట. ఈ మేరకు ఆ పార్టీ సైద్ధాంతిక కర్తగా భావిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెలుగు చూసింది. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 సీట్లుండగా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే… బీజేపీకి కేవలం 60 నుంచి 65 సీట్లు మాత్రమే వస్తాయని ఈ సర్వే తేల్చింది.
దళిత యువకులపై దాడి ఘటన ఆ రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ ను అమాంతం కిందకు పడేసిందని స్వయంగా కర సేవకుల చేత చేయించిన సర్వేతో తేలింది. మరో వైపు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఆ రాష్ట్రంలో గిరిజనులు కూడా రోడ్డెక్కేందుకు సిధ్దమవుతున్నట్లు కూడా ఆ సర్వే డేంజర్ బెల్స్ మోగించింది. దీంతో ప్రధాని మోడీ అడ్డాలో బిజెపికి వ్యతిరేక పవనాలు వీస్తుండడం, ప్రధానిగా మోడీకి భారీ షాక్ వంటిదేనని పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి.