పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశంలోని ప్రజలందరూ బ్యాంకుల ముందు క్యూ కడుతూ కనిపిస్తున్నారు కదా! మరి ఈ కష్టాలు సామాన్యులకేనా? దేశంలోని పెద్ద నాయకులు, ప్రజలు ఎంతగానో గౌరవించే నాయకులు బ్యాంకుల ముందు క్యూ కడితే ఎలా ఉంటుంది. ఇటువంటి ఆలోచనే చేశారు నెటిజన్లు. పెద్ద నోట్ల రద్దుపై ప్రజలు పడుతున్న అవస్థలపై ఎన్నో ఫొటోలు, కార్టూన్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వాటిల్లో ఓ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్యాంకు ముందు నిలబడ్డారు. ఆయన వెనుకే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆ తరువాత బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ ఉన్నారు. ముగ్గురు కళ్లజోడు పెట్టుకొని తాము సాధారణంగా ప్రజలకు కనిపించే గెటప్ లోనే బ్యాంకు క్యూ ముందు నిలబడ్డారు. ఈ కల్పిత ఫోటోలో మోడీ సీరియస్ గా కనిపిస్తుండగా, మిగతా వారు డబ్బుల కోసం క్యూ కట్టి కష్టపడిపోయినట్లు కనిపిస్తున్నారు. ఈ నేతలు బ్యాంకు ముందు క్యూ కట్టడంపై నెటిజన్లు జోకులకు అంతు లేదు మరి!
‘ఇంతకీ వీళ్ళు లైన్ లో నిల్చున్నది డబ్బుల కోసమా? జియో సిమ్ ల కోసమా?’ అన్న పంచ్ లు సోషల్ మీడియా వేదికగా పేలుతున్నాయి.