Narendra Modi last chance to black money holdersనల్ల కుభేరులకు మోడీ సర్కార్ మరో అవకాశం ఇచ్చింది. తమ వద్ద ఉన్న అప్రకటిత ఆదాయాన్ని స్వచ్ఛందంగా ప్రకటించే వీలు కల్పించింది. ఈ శనివారం నుంచి అమల్లోకి వచ్చే ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’లో భాగంగా చివరి అవకాశం ఇచ్చింది. ఇందులో భాగంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ చేసిన భారీ డిపాజిట్లపై 50 శాతం పన్ను చెల్లించడం ద్వారా దానిని తెల్లధనంగా మార్చుకోవచ్చు. ఇలా స్వచ్ఛందంగా ప్రకటించే వారి పేర్లను ప్రభుత్వం బయటకు వెల్లడించడం కానీ, విచారణ చేయడం కానీ చేయదని రెవెన్యూ కార్యదర్శి హస్‌ముఖ్ అదియా పేర్కొన్నారు.

అంతేకాదు, ఇలా వెల్లడించిన మొత్తాన్ని ఆ తర్వాత ఇన్‌ కమ్ ట్యాక్స్ రిటర్స్‌ లలో చూపించాల్సిన అవసరం కూడా లేదని తెలిపారు. ఈ పథకాన్ని వినియోగించుకోకుండా పట్టుబడితే మాత్రం తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో భారీగా జమ చేసిన పాత నోట్లను ఐటీ రిటర్నుల్లో చూపిస్తే పన్ను, జరిమానాతో కలిపి మొత్తం 77.25 శాతం వరకు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే స్వచ్ఛందంగా వెల్లడించకుండా, రిటర్నుల్లో చూపించకుండా దొరికితే మాత్రం పన్నుపై అదనంగా మరో పది శాతం జరిమానా కూడా విధిస్తామని, విచారణ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని అదియా హెచ్చరించారు.

టాక్సేషన్ లాస్ యాక్ట్, 2016 బిల్లు గురువారం రాత్రే రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఇందులో భాగంగా ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ (పీఎంజీకేవై) శనివారం నుంచి ప్రారంభమవుతుందని అదియా పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుందని, అప్రకటిత ఆదాయానికి 50 శాతం పన్ను చెల్లించి 25 శాతం సొమ్మును నాలుగేళ్లపాటు పీఎంజీకేవై డిపాజిట్ పథకంలో పెట్టడం ద్వారా ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చని వివరించారు. ఈ 25 శాతం సొమ్ముకు నాలుగేళ్ల పాటు ఎలాంటి వడ్డీ రాదని స్పష్టం చేసారు.

నల్ల డబ్బుకు పన్నులు చెల్లించి, ఆ డిపాజిట్లపై దర్యాప్తు ముగిసిన తర్వాత మాత్రమే అది తెల్లధనంగా మారుతుందని, మనీలాండరింగ్‌కు పాల్పడే అక్రమార్కుల గురించి తెలిస్తే [email protected] కు సమాచారం అందించాలని అదియా కోరారు. అయితే తొలుత ప్రవేశపెట్టిన ‘ఐడీఎస్’ పధకంలో నల్లకుభేరులమంటూ చేసిన ప్రకటనలు మోడీ సర్కార్ ను బోల్తా కొట్టించిన విషయం తెలిసిందే. దీంతో మరో అవకాశం ఇవ్వడమంటే… నల్లకుభేరులను మోడీ సర్కార్ ఇంకా నమ్ముతోందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.