narendra modi in hyderabadఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు మరియు సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ కోసం హైదరాబాద్ విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన ఓ రెండు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విశేషం ఏమిటంటే ఈ రెండు వీడియోలకు సంబంధించి రెండు వాదనలను నెటిజన్లు వినిపిస్తున్నారు.

అందులో మొదటి వీడియో… విశ్వ సమతామూర్తి శ్రీ రామానుజాచార్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ప్రసంగం. ఆధ్యాత్మికంగా మారిన ఈ వేడుకలో ప్రధాని తెలుగు సినిమా ప్రస్తావనను తీసుకురావడం విశేషం. ప్రస్తుతం తెలుగు సినిమా మరియు ఓటీటీ ప్లాట్ ఫామ్ వెలిగిపోతోందని ప్రశంసల జల్లు కురిపించారు ప్రధాని.

మోడీ వ్యక్తపరిచిన భావం సమంజసమే అయ్యుండొచ్చు, నిజంగానే తెలుగు సినిమా వెళిపోతుండొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు, కానీ విచ్చేసిన సందర్భానికి – తెలుగు సినిమాకు సంబంధం ఏమిటి? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఇదే చర్చ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చేపట్టడంతో, ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

కేవలం తెలుగు వాళ్ళు అంటే సినిమాకు సంబంధించి మాత్రమే మాట్లాడతారా? అంటే తెలుగు ప్రజలు సినిమా పిచ్చోళ్ళు అని ప్రధాని పరోక్షంగా చెప్తున్నారా? అన్న ప్రశ్నలు హైలైట్ అవుతున్నాయి. ప్రధాని ఈ విధంగా మాట్లాడుతున్న సందర్భంలో చిన్నజీయర్ స్వామి ప్రదర్శించిన హావభావాలు కూడా ఈ ప్రశ్నలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

ఇక్కడ తెరపైకి వస్తోన్న మరో వాదన ఏమిటంటే… హైదరాబాద్ కు ప్రధాని విరివిగా ఏమి విచ్చేయరు గనుక, వచ్చినపుడే తనలోని అన్ని భావాలను ప్రజలతో పంచుకుంటారు, అందులో తప్పేముంది? అయినా తెలుగు వారిని కీర్తిస్తుంటే గర్వపడాలి గానీ, అందులో బొక్కలను వెతుకుతూ పక్కదారి పట్టించడం దేనికన్న భావన మరో వర్గం నుండి వ్యక్తమవుతోంది.

మొదటి వీడియో పరిస్థితి ఇలా ఉంటే, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో ప్రధాని నిల్చుని నిద్రపోయే విధంగా ఉన్న మరో వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రధాని కళ్ళు మూసిన సందర్భంలో పక్కనే ఉన్న చిన్నజీయర్ స్వామి ప్రధాని చేయి తట్టి పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సైగ చేయగా, ప్రధాని పూజా కార్యక్రమాలను కొనసాగించారు.

అయితే ప్రధానిగా మోడీకున్న టైట్ షెడ్యూల్ రీత్యా, కంటి మీద అలా ఓ కునుకు వేస్తే, దానిని కూడా రాద్ధాంతం చేయడం ఏమిటన్న వాదన తెరపైకి వచ్చింది. అనుకూల వాదులు ఇలా వెనకేసుకు వస్తుండగా, ప్రతికూల వాదులు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ స్వాగతం పలకకుండా ప్రారంభమైన ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన ఆసాంతం హాట్ టాపిక్ గా మారింది.