ఆంధ్ర ప్రదేశ్ కు జీవాధార వంటి పోలవరం ప్రాజెక్ట్ కు కేంద్ర ప్రభుత్వం మరో అడ్డుపుల్ల వేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పనులకు టెండర్లు పిలవగా కేంద్రం వాటిని నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్పిల్వే, స్పిల్ చానల్లో కొంత భాగానికి జారీ చేసిన టెండర్లను నిలిపివేయాలని స్పష్టం చేసింది.
కేంద్ర జల వనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 27న లేఖ రాసింది. జాతీయ హైడ్రో పవర్ కార్పొరేషన్ అద్యయనం చేసేవరకు పనులను నిలుపుదల చేయాలని కేంద్రం తెలిపిందని సమాచారం. ఎన్హెచ్పీసీ ఎగువ కాఫర్ డ్యామ్ పనులపై అధ్యయనం చేసేందుకు పోలవరం ప్రాజెక్టు వద్దకు రాలేదు.
కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు బ్రేకులు వెయ్యాలని చూడటంతో రాష్ట్ర ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కేంద్ర వైఖరిని ఆ పార్టీ నాయకులు కూడా సమర్ధించడానికి ఇబ్బంది పడుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.