ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మొర ఆలకించింది. కరోనా తో తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాలకు వెసులుబాటు కలిపించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల అప్పుల పరిమితిని పెంచింది. ఇప్పటివరకూ… రాష్ట్రాల రుణపరిమితిని జీఎస్డీపీలో 3 శాతంగా ఉంది. ఇప్పుడు దానిని 5శాతానికి పెంచామని ప్రకటించింది.
రుణ పరిమితి పెంపు వల్ల రాష్ట్రాలకు రూ.4.28లక్షల కోట్లు అదనంగా అప్పులు తెచ్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఇందులో 0.5% పెంపు ఎటువంటి షరతులు లేకుండా ఉంటుంది. అయితే మరో 1.5% పెంపు మాత్రం సంస్కరణలతో లింక్ చేస్తారు. సంస్కరణలు మెరుగ్గా అమలు చేసిన రాష్ట్రాలకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
ఈ వెసులుబాటు కేవలం ఈ ఆర్ధిక సంవత్సరానికి మాత్రమే పరిమితం. అప్పుల పరిమితి పెంచితే చాలా రాష్ట్రాలు… విచ్చలవిడిగా సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించి ఓటు బ్యాంకు రాయకీయలకు తెరలేపే అవకాశం ఉండటంతో సంస్కరణల లింకు పెట్టింది కేంద్రం. రుణపరిమితి పెంచమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కాలం నుండి డిమాండ్ చేస్తున్నారు.
షరతులతో కూడిన ఈ ప్రకటనను స్వాగతిస్తారో లేదో చూడాలి. కరోనా వల్ల కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా భారీగా ఆదాయాలు కోల్పోయాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు కొంతమేర మాత్రమే జీతాలు ఇస్తున్నాయి. ఇప్పటికే రెండు నెలల జీతం పూర్తిగా రాలేదు. వచ్చే నెల కూడా ఇదే పరిస్థితి ఉండటంతో ఆదాయం కోసం వైన్ షాపులు ఓపెన్ చేశారు.