సోషల్ మీడియాలో తనకు తిరుగులేదని ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు చాటిచెప్పుకున్నారు. ఫేస్ బుక్ ఫాలోవర్లలో ప్రపంచంలోనే టాప్ లీడర్ గా మోడీ అవతరించారు. ఫేస్ బుక్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అనుసరిస్తున్నవారి కంటే ఇండియన్ ప్రధాని మోడీని అనుసరిస్తున్న వారి సంఖ్యే అధికమని తేలింది. ప్రస్తుతం భారత ప్రధాని ఫాలోవర్ల సంఖ్య 4.17 కోట్లకు చేరుకుంది. మే 2014లో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు 1.4 కోట్లు ఉన్న మోడీ ఫాలోవర్ల సంఖ్య, ప్రస్తుతం 4.17 కోట్లకు చేరుకోవడం విశేషం.
ఫేస్ బుక్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకి దాస్ దీనిపై ఓ అధికారిక ప్రకటన చేసారు. నోట్ల రద్దు వంటి పలు విప్లవాత్మక చర్యలను ప్రభుత్వం తీసుకున్నప్పటి నుంచి మోడీ ప్రభ ఒక్కసారిగా పెరిగినట్టు చెప్పారు. మోడీ తర్వాత కేంద్రమంత్రులు రాజ్నాథ్సింగ్, స్మృతి ఇరానీ, జనరల్ వీకే సింగ్, పీయూష్ గోయల్, అరుణ్ జైట్లీలకు ఫేస్ బుక్లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రజలతో సంబంధాల విషయంలో సమాచార మంత్రిత్వ శాఖ, విదేశీ మంత్రిత్వ శాఖ, రైల్వేశాఖలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.