ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక రాగి చెంబు, దాని నిండుగా గంగా జలం, మట్టి తెచ్చిన విషయం తెలిసిందే. రాజధానికి లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ప్రకటించి, ప్రజలను ఉత్సాహపరుస్తారని భావిస్తే… ఏపీ ప్రజల నోట్లో మోడీ మట్టి కొట్టారని అప్పట్లో ప్రతిపక్షాలు, మీడియా వర్గాలు తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. అలా ఏపీ వరకు ఒక రాగి చెంబును ఇవ్వగలగడంలో పూర్తిగా విజయం సాధించారు ప్రధాని మోడీ.
తాజాగా ఈ నెల 7వ తేదీన తొలిసారిగా ప్రధానమంత్రి స్థాయిలో తెలంగాణా పర్యటన చేయబోతున్నారు మోడీ. తెలంగాణా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ‘మిషన్ భగీరధ’ పధకాన్ని ప్రారంభించడానికి విచ్చేయనున్న మోడీ, తెలంగాణా ప్రజలకు ఎలాంటి వరాలను అందిస్తారో అన్న ఉత్సుకత రాజకీయ వర్గాల్లో నెలకొని ఉంది. అయితే ఈ అంచనాలు పెట్టుకునే వారందరికీ ప్రధాని మరో ట్విస్ట్ ఇవ్వబోతున్నారని పొలిటికల్ వర్గాల టాక్.
ఇటీవలే ఢిల్లీలో పిఎం కార్యాలయం ఓ రాగి చెంబును కొనుగోలు చేసిందని, ఆ చెంబు నిండా గంగా జలం తీసుకువచ్చిన ‘మిషన్ భగీరధ’ను ప్రారంభించనున్నారని మీడియా వర్గాల్లో చలోక్తులతో కూడిన కధనాలు ప్రసారమవుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలకు రాగి “చెంబు”లను ఇచ్చిన ఘనతను మోడీ సొంతం చేసుకుంటారని సోషల్ మీడియాలో పడుతున్న కామెంట్స్ కు కూడా కొదవలేదు. అధికారంలో భాగస్వామి అయి ఉండి, కష్టాల్లో ఉన్న ఏపీకే నిధులు ఇవ్వని పక్షంలో, తెలంగాణా రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తారనుకోవడం అత్యాశే అనడంలో సందేహం లేదేమో!