చుక్కేసి డ్రైవింగ్ చేసే మందుబాబులకు కేంద్ర కేబినేట్ భారీ ఝలక్ ఇచ్చింది. మద్యం తాగి వాహనం నడిపితే ఏకంగా 10 వేల రూపాయల జరిమానా విధించాలని కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. అలాగే సీట్ బెల్టు పెట్టుకోకుంటే 1000 రూపాయల జరిమానా, హెల్మెట్ లేకుంటే 2 వేల రూపాయల జరిమానాతో పాటు మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు.
ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ తో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే 500 జరిమానా విధించనున్నారు. అలాగే జువైనల్స్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే వారి గార్డియన్స్ కు 25 వేల రూపాయలు జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష, వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. డ్రైవర్లు మద్యం మత్తులో జరిపే యాక్సిడెంట్లను అదుపు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై అన్ని రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయనుంది.
ఈ నిబంధనలతో వాహనదారులు ఇక్కట్లు తప్పేలా కనపడడం లేదు. కేవలం హెల్మెట్ లేకపోతేనే 2 వేల రూపాయలు ఫైన్ అంటే దీనిపై ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. కేంద్రం తీసుకున్న ఈ కఠినతరమైన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు అమలు చేస్తాయన్నది ప్రశ్నార్ధకమే!