నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు… సొంత పార్టీ మీద తిరుగుబాటు చేశారు. ఆయన, ఆ పార్టీ నేతలు బాహాటంగానే మీడియాలో ప్రచ్ఛన్న యుద్ధానికి తెగబడుతున్నారు. అయితే ఈ వివాదం పై జనసేన అభిమానులు ఎంతో ఆశలు పెట్టుకునట్టుగా కనిపిస్తుంది. ఎలాగోలా రఘురామ కృష్ణం రాజు సస్పెండ్ అయ్యి అక్కడ ఉపఎన్నిక రావాలని కోరుకుంటున్నారు.
“ఉపఎన్నిక వస్తే… రఘురామ కృష్ణం రాజు తాను ఓడిపోవడం… వైఎస్సార్ కాంగ్రెస్ ని ఓడించడం ఖాయం. టీడీపీకి ఎలానూ సీన్ లేదు. ఇక గెలిచేది జనసేన – బీజేపీ అభ్యర్ధే,” అని వారు అంటున్నారు. కొందరైతే ఇటీవలే నాగబాబు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చెయ్యను అంటున్నాడు కాబట్టి ఈ సారి పవన్ కళ్యాణ్ పోటీ చేసి పార్లమెంట్ కు వెళ్లడం ఖాయమని అంటున్నారు.
అయితే రాజకీయాలు అనుకున్నంత తేలికగా ఉండవు. టీడీపీ బలహీనపడినా, జనసేన – బీజేపీ టీడీపీ కంటే మెరుగ్గా రాణించే అవకాశం లేదని అంటున్నారు నిపుణులు. అదే సమయంలో రఘురామ కృష్ణం రాజు తిరుగుబాటు బీజేపీ అండచూసుకునే… ఆయనను సస్పెండ్ కాకుండా చూసుకుంటుంది ఆ పార్టీ… ఒకవేళ ఉపఎన్నిక అనివార్యమైనా ఆ సీటు బీజేపీకి ఇవ్వాలి.
అప్పుడు ఆ పార్టీ తరపున రఘురామ కృష్ణం రాజు పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. దానితో జనసైనికుల కోరికలేమి నెరవేరే అవకాశం లేదు. అనూహ్యమైన పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటే తప్ప. పవన్ కళ్యాణ్ ను చట్టసభల్లో చూడాలంటే వారు మరింత కాలం వెచ్చి చూడాల్సిందే.