Nara_Lokesh_Yuva_Galam_Padayatra_Vangaveeti_Radha_TDPవంగవీటి… ఏపీ ప్రజలకు పరిచయమే అవసరం లేని పేరు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో వంగవీటి కుటుంబానికి ఉన్న పలుకుబడి అందరికీ తెలిసిందే. గత ఎన్నికలకు ముందు వంగవీటి రాధ టిడిపిలో చేరారు. కానీ పార్టీ పరంగా జరిగే సభలు, సమావేశాలు, కార్యక్రమాలలో పెద్దగా పాల్గొనలేదు. కనీసం కృష్ణా జిల్లాలో పర్యటించి నియోజకవర్గాలలో తన బలం పెంచుకొనే ప్రయత్నం కూడా చేయలేదు.

అలాగని రాజకీయాల నుంచి రిటైర్ అయ్యే ఆలోచనలు కూడా చేయడం లేదు. ఇటీవలన జనసేనలో చేరబోతున్నారని, రాబోయే ఎన్నికలలో మచిలీపట్నం నుంచి పోటీ చేయబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి కూడా! కానీ వంగవీటి రాధ ఆ ఊహాగానాలను కూడా ఖండించే ప్రయత్నం చేయకపోవడంతో ఆయన టిడిపిని వీడి జనసేనలో చేరడం ఖాయమనే అందరూ భావిస్తున్నారు.

కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, వంగవీటి రాధ ఈరోజు ఉదయమే పీలేరు నియోజకవర్గంలో నారా లోకేష్‌ బస చేసిన ఇందిరమ్మ నగర్‌లో విడిదివద్దకు చేరుకొని, నారా లోకేష్‌తో సెల్ఫీలు దిగి ఆయనతో కలిసి యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. తద్వారా తాను జనసేనలో చేరబోతున్నాననే ఊహాగానాలకు వంగవీటి రాధ చెక్ పెట్టారని చెప్పవచ్చు. అయితే వంగవీటి రాధ రాజకీయాలలో కొనసాగాలనుకొంటే, చంద్రబాబు నాయుడు,నారా లోకేష్‌, అచ్చన్నాయుడు తదితర టిడిపినేతల్లాగా పార్టీ కార్యక్రమాలలో, రాజకీయాలలో కూడా చాలా యాక్టివ్‌గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వంగవీటి పేరుతోనే కలకాలం రాజకీయాలను శాసించవచ్చనుకొంటే నష్టపోవడం ఖాయం.