లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో తెలుగుదేశం పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు. అయితే వ్యక్తిగతంగా ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు అని చెప్పలేదు. మంగళగిరిలో లోకేష్ గెలుస్తున్నారా అన్న ప్రశ్నకు ఆయన పులివెందుల, కుప్పం, మంగళగిరి లాంటి వాటి గురించి అడగొద్దు అని లోకేష్ గెలవబోతున్నట్టు చెప్పకనే చెప్పారు. ఇదే సమయంలో కొందరు తెలుగుదేశం నాయకులకు మంగళగిరి సర్వే గురించి ఆయన చెప్పారట.
దాని ప్రకారం లోకేష్ తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ సిట్టింగు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కంటే 20% ఓట్ల ఆధిక్యంలో ఉన్నారట. 20% శాతం తేడా అంటే లోకేష్ భారీ మెజారిటీతో గెలుస్తున్నట్టే. ఒకవేళ ఇది నిజమైతే లోకేష్ రాజకీయ జీవితానికే పెద్ద బూస్టు అని చెప్పుకోవచ్చు. గతంలో దొడ్డి దారిన కేబినెట్ లో చేరారు అని హేళన చేసిన వారికి సరైన సమాధానం ఇచ్చినట్టే. నారా లోకేష్ తన జీవితంలోని మొట్టమొదటి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.
1985 తరువాత తెలుగుదేశం పార్టీ ఒక్క సారి కూడా గెలవని మంగళగిరిని ఆయన ఎంచుకోవడం విశేషం. గత ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అటువంటి చోటు నుండి పోటీ చెయ్యడమే సాహసం. ఇక్కడ నుండి ఆయన భారీ మెజారిటీతో గెలిస్తే సంచలనం నమోదు చేసినట్టే. తనను ఇప్పటివరకూ హేళన చేసిన నోళ్ళు మూతపడినట్టే అనుకోవాలి. లోకేష్ గెలిచి టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్ వచ్చే ఐదేళ్ళల్లో బలీమైన రాజకీయ శక్తిగా మారడం ఖాయం.