“గెలుపుది ఏముందిరా? మహా అయితే నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచం ఏంటో నీకు పరిచయం అవుతుంది” అని ఒక సినిమా డైలాగు. అయితే నారా లోకేష్ కు సరిగా ఇప్పుడు అదే జరుగుతుంది. టీడీపీ ఓటమి అనంతరం లోకేష్ సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటున్నారు.
కార్యకర్తలను విరివిగా కలిసే అవకాశం కూడా కలుగుతుందు. దానితో ఆయనకు కార్యకర్తలకు బాగా దగ్గరగా ఉంటున్నారు. ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడుతున్న కార్యకర్తల దగ్గరకు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. అలాగే సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తల సలహాలు సూచనలతో పాటు వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు.
తాజాగా చిత్తూర్ జిల్లాకు చెందిన ఉమేష్ సింగ్ అనే కార్యకర్తకు కాన్సర్ సోకిందని ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నారని సోషల్ మీడియా ఫ్యాన్స్ లోకేష్ దృష్టికి తెచ్చారు. లోకేష్ వెంటనే స్పందించి “ఆయన ఒక కుటుంబసభ్యుడు. ఆయన బాధ్యత మేము తీసుకుంటాం. ఆయనకు అన్ని విధాలా సాయం చేస్తాం,” అని అభయం ఇచ్చారు.
దీనితో కార్యకర్తల ఆనందానికి అవధులు లేవు. కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండటం, వారి సుఖదుఃఖాలలో పాలుపంచుకోవడం వల్లే రాజకీయ నాయకులు గొప్ప ఎత్తులకు చేరుకుంటారు. ఇప్పుడు లోకేష్ అటువంటి ప్రయత్నమే చెయ్యడం మంచిదే. కష్టకాలంలో టీడీపీకి కూడా అది ఎంతో అవసరం.