టిడిపి యువనాయకుడు నారా లోకేష్ ఈరోజు 19వ రోజు పాదయాత్రలో సత్యవేడు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన దారిలో ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, పర్యాటక మంత్రి ఆర్కె. రోజా భూకబ్జాల గురించి చిట్టా చదివారు.
“అన్నా… ఎంతైనా జబర్దస్త్ ఆంటీ కదా… కనుక ఏం చేసినా జబర్దస్త్ గానే ఉంటాయి. లాండ్ కబ్జాలు కూడా జబర్దస్త్ గానే చేసింది ఆంటీ. విజయపురం మండలంలో కొసలనగరంలో 35 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసింది మన జబర్దస్త్ ఆంటీ. వనమలపేటలో టోల్ప్లాజా వద్ద 55 ఎకరాల ప్రభుత్వ భూమి గోవిందా… గోవిందా…!
ఇక్కడే కాదు… వైజాగ్ ఋషికొండ వద్ద ఎకరం భూమి గోవిందా… గోవిందా అయిపోయింది. ఇసుక, ఎర్రచందనం, గంజాయి కూడా పక్క రాష్ట్రాలకి రవాణాచేసి పంపిస్తున్నారు ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు,” అంటూ నారా లోకేష్ వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతి బండారాన్ని బయటపెట్టారు. ‘గోవిందా గోవిందా…’ అంటూ ఆయన చెప్పిన తీరు ప్రజలని చాలా ఆకట్టుకొంది.
జనసేనాని పవన్ కళ్యాణ్ మంత్రి రోజాకి ‘డైమండ్ రాణీ’ అని పేరు పెడితే నారా లోకేష్ ఆమెకి ‘జబర్దస్త్ ఆంటీ’ అని మరో పేరు పెట్టారు. ఎప్పటికైనా మంత్రి పదవి చేపట్టాలని కలలుగన్న ఆమె పదవి చేపట్టాక ఏనాడూ తన పర్యాటకశాకకి సంబందించి విషయాలని మాట్లాడకుండా ఎప్పుడూ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లని ఎగతాళి చేయడమే పనిగా పెట్టుకొన్నారు.
గోడకేసి బంతిని కొడుతున్నప్పుడు మనం ఎన్నిసార్లు కొడితే అది అన్నిసార్లు అంతే వేగంతో తిరిగి వస్తుంటుంది. అదేవిదంగా మంత్రి రోజా చేసిన అనుచిత వ్యాఖ్యలకి నారా లోకేష్ ఇంత జబర్దస్త్ గా తిప్పి కొడుతున్నారు.
బహుశః ఇక ఏపీ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ రంగంలో దిగుతారేమో? ఒకవేళ దిగితే ముందుగా తాడేపల్లికి కూతవేటు దూరంలో అంధురాలు హత్యకి గురవడం, ట్రిపుల్ ఐటిలో విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడం గురించి విచారణ మొదలుపెట్టాల్సి ఉంటుంది.