ఏపీ రాజకీయాల్లో లోకేష్ రోజు రోజుకూ రాటుదేలు తున్నారనే చెప్పుకోవాలి. మొదట్లో కంటే ఇప్పుడు ఆయన స్పీడు పెంచారు. దూకుడు రాజకీయాలకు ఒకప్పుడు ఆయన కొంచెం దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు వైసీపీని ఎదుర్కోవాలంటే కావాల్సిందే దూకుడే అని డిసైడ్ అయిపోయారు. అందుకే ఆయన వైసీపీ మీద తనదైన మాటల బాణాలను సంధిస్తున్నారు. ఇన్ని రోజులు వైసీపీ దూకుడు టీడీపీని కొంత ఇబ్బంది పెట్టింది.
కానీ ఇప్పుడు పార్టీకి సరైన సమయంలో లోకేష్ దూకుడు మేలు చేస్తోంది. ఈ సమయంలో కావాల్సింది ఇదే అంటూ తమ్ముళ్లు కూడా ఆయన వెంటే నడుస్తున్నారు. ఇన్ని రోజులు మనం ఏమీ అనకుండా ఉంటే.. వైసీపీ వాళ్లు రెచ్చిపోయారని, వాళ్లు ఎన్నెన్ని మాటలు అన్నారో, ఎంతెంత అవమానించారో ఇప్పుడు అవన్నీ వడ్డీతో సహా కలిపి ఇచ్చే టైమ్ వచ్చిందంటున్నారు.
వాస్తవానికి లోకేష్ ఇన్ని రోజులు చాలా సంయమనంగా ఉన్నారు. ఎవరెన్ని రకాలుగా అవమానించినా ఆచితూచి వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఆయన మాటల్లో చాలా దూకుడు పెంచారు. మనం మంచిగా మాట్లాడితే వైసీపీ వాళ్లు కించపరిచేలా మాట్లాడటం ఆపట్లేదు కాబట్టి.. వారికి బుద్ధి చెప్పాలంటే మనం కూడా దూకుడుగానే మాట్లాడాలి అన్నట్టు ఆయన ప్రసంగాలు సాగుతున్నాయి.
గతంలో లోకేష్ ఆచితూచి వ్యవహరిస్తూ మాట్లాడిన ప్రసంగాల కంటే కూడా.. దూకుడుగా వ్యవహరిస్తున్న తీరుకు, ప్రసంగాలకే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. వాటికే ప్రజలు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు. దాంతో టీడీపీ తమ్ముళ్లు ఫుల్ కుషీ అవుతున్నారు. తమకు సరైన నాయకుడు వచ్చేశాడని, వైసీపీ వాళ్ల పని అయిపోయిందంటూ చెప్పేస్తున్నారు.
లోకేష్ గనక ఇలాగే దూకుడుగా ముందుకు వెళ్తే మాత్రం.. వైసీపీకి చెక్ పెట్టడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు రాజకీయ నిపుణులు. ఇప్పుడు లోకేష్ అంటే కార్యకర్తల మనిషి అనే ముద్ర కూడా వేసుకున్నారు. ఎక్కడ ఎవరికి చిన్న అపాయం వచ్చినా నేరుగా ఆయనే వెళ్తూ పరామర్శిస్తున్నారు. అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఇప్పుడు ఆయనలో పుష్కలంగా ఉన్నాయంటున్నారు రాజకీయ నిపుణులు.