దేశంలో ఏ రాజకీయ నాయకుడు ప్రకటించని విధంగా తమ ఆస్తులను ప్రకటించడం ఒక్క నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికే చెందిందని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం నారా లోకేష్ చేసే ఆస్తుల ప్రకటన తర్వాత, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ దుమారం చేయడం సర్వ సహజం. అలా అని ప్రతిపక్ష నేతలు తమ ఆస్తుల ప్రకటన మాత్రం ఎన్నడూ చేయరనుకోండి… అది వేరే విషయం… అలా ప్రకటించడం కూడా ఆ పార్టీ నేతల దృష్టిలో చాలా తప్పుడు పని అన్న భావనలో చూస్తుంటారు.
అయితే ఇలా ప్రతిపక్ష నేతలు ‘జగన్ అండ్ కో’ ఆరోపణలు చేసిన తర్వాత… ఆగ్రహంతో నారా లోకేష్ ఛాలెంజ్ విసరడం… మళ్ళీ కొన్నాళ్ళ వరకు ఆ ప్రస్తావన లేకుండా తోక ముడవడం ప్రతిపక్ష నేతలకు పరిపాటిగా మారిపోయింది. తాజాగా విశాఖలో జరిగిన మహాధర్నాలో నారా లోకేష్ పై మరియు చంద్రబాబుపై ప్రతిపక్ష జగన్ యధావిధిగా అవినీతి మరియు ఆస్తుల పెంపకాలపై ఆరోపణలు చేసారు. దీంతో మళ్ళీ ఆగ్రహించిన నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా జగన్ కు సవాల్ విసిరారు.
“జగన్ కు 24 గంటల టైం ఇచ్చి మరీ సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే నాపై చేసిన ఆరోపణలను నిరూపించాలి. మీకిలా సవాల్ విసరడం మూడో సారి… ఆధారాలు చూపించమంటే పారిపోతారెందుకు? మళ్ళీ అడుగుతున్నా, బహిరంగ చర్చకు సిద్ధమా? ముఖ్యమంత్రి కొడుకైనంత మాత్రాన అందరూ నీలా ప్రజల సొమ్ము దోచుకుంటారా? నీ పచ్చ కామెర్ల కంటితో చూసి ఆరోపణలు చేయకు. మాది కీర్తి సంపాదన, నీది అవినీతి సంపాదన…” అంటూ జగన్ పై మండిపడుతూ పంచ్ లతో కూడిన సంచలన ట్వీట్స్ చేసారు.
అయితే నారా లోకేష్ ఇలా సవాల్ విసిరిన ప్రతిసారి ‘జగన్ అండ్ కో’ ఆ టాపిక్ ను కొన్నాళ్ళ పాటు ఎత్తకుండా సైలెంట్ గా ఉంటుంటారు. ఈ సారి జరగబోయేది కూడా అదే! ఇక్కడ లోకేష్ కూడా ఒక లాజిక్ మరిచినట్లున్నారు. సొంత మీడియా మైక్ ఉంటే సరిపోతుందని ఆరోపణలు చేస్తున్నారు గానీ, అవి నిరూపించాలంటే ఆధారాలు కావాలి కదా… అందుకే ఎన్నిసార్లు సవాల్ చేసిన ప్రయోజనం శూన్యం..! మూడు సార్లు కాదు, మరో ముప్పై సార్లు సవాల్ చేసినా… జగన్ అండ్ కో చేసే రెగ్యులర్ ప్రక్రియ ఇదే..!
ఒకప్పుడు తాను ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నపుడు అలా చేశాను కాబట్టి… అందరూ అలాగే చేస్తారనేది జగన్ భావన అయ్యుండొచ్చు… అర్ధం చేసుకోవాలి కదా… లోకేష్ బాబు గారు..!