రాజకీయాలు ఒంటపడితే చాతుర్యం ఆటోమాటిక్ గా అదే వచ్చేస్తుంది. నారా లోకేష్ విషయంలో ప్రస్తుతం అదే ఛాయలు కనపడుతున్నాయి. ఒకప్పుడు రాజకీయాలకు సూట్ కాడని నిర్మొహమాటంగా చెప్పిన నేతల స్వరంలో తాజాగా మార్పులు కనపడుతున్నాయి. అందుకు నారా లోకేష్ అనుసరిస్తోన్న రాజకీయ విధానాలే కారణం. గతంలో చేసిన తప్పులను మననం చేసుకుంటూ, విమర్శలను హుందా పంచ్ ల రూపంలో మాట్లాడుతుండడంతో వీక్షకులకు చేరువ అవుతున్నాడు.
ముఖ్యంగా ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా అనేక ఛలోక్తులు విసురుతున్న లోకేష్, తాజాగా వైసీపీ అధినేత విషయంలోనూ పంచ్ లు పేల్చారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పేరు ప్రస్తుతం మారిందని, ఆయన పేరు ‘జగన్ మోడీ రెడ్డి’ అంటూ ఎద్దేవా చేసారు. మోడీపై విమర్శలు చేస్తే జైలు పోవాల్సి వస్తుందన్న భయం జగన్ లో కనపడుతోందంటూ డిఫెన్స్ లోకి నెట్టే ప్రయత్నం చేసారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా లోకేష్ ఈ ఛలోక్తులు సంధించారు.