కొందరు నాయకులు అదేంటో ప్రతిపక్షంలో ఉండగా మహా తెలివిగా కనిపిస్తారు, ఆలోచిస్తారు. అధికారంలోకి వచ్చాకా అసలు ఆయన ఈయనేనా అనిపించేలా నిర్ణయాలు తీసుకుంటారు. అధికార మత్తులో రియాలిటీకి దూరంగా ఉంటారో లేక తమ చుట్టూ ఉండే వందిమాగధులు నిజాలు కనిపించనివ్వరో తెలీదు.
సరిగ్గా జగన్ విషయంలో ఇలానే జరుగుతుంది. అధికారంలోకి రావడానికి పాదయాత్ర మొదలుపెట్టిన నాటి నుండీ ప్రమాణ స్వీకారం చేసేవరకు జగన్ వేసిన ప్రతిఅడుగు రాజకీయంగా చాలా ఉపయోగపడింది. చంద్రబాబు నాయుడు వంటి రాజకీయ దురంధరుడినే ఓడించగలిగారు ఆయన.
అయితే అధికారంలోకి వచ్చాకా ఏమైందో తెలీదు. జగన్ ప్రభుత్వం తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాలు ఒక ఎత్తు అయితే లోకేష్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఇంకో ఎత్తు. టీడీపీ అధికారంలో ఉండగా లోకేష్ మీద సక్సెస్ ఫుల్ గా పప్పు అనే ముద్ర వేసింది వైఎస్సార్ కాంగ్రెస్. దానితో ఆయన సొంత సీట్లో ఓడిపోయారు.
ఆ మరక చెరుపుకోవడానికి లోకేష్ ఎన్నో తంటాలు పడుతున్నా… సహజంగా అది అంత తేలికైన విషయం కాదు. రాహుల్ గాంధీ విషయంలో ఏమైందో మన అందరికీ తెలుసు. అయితే లోకేష్ విషయంలో పాటు ఇమేజ్ మేక్ ఓవర్ లో ఆయన సొంత కృష్టితో పాటు జగన్ కృషి కూడా ఉంది. లోకేష్ ని ఇప్పటివరకు రెండు సార్లు అరెస్ట్ చేసింది ప్రభుత్వం.
ఆయన చేసిన నేరం ఏమిట్రా అంటే బాధిత కుటుంబాలను పరామర్శించడం. రెండు పర్యాయాలు అతివలకు సంబంధించినవే. సహజంగా ఏ మాత్రం విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా ఈ విషయంలో అతి చేస్తే రాజకీయంగా ఇబ్బంది పడతారు అని చెప్పగలరు. అయితే జగన్ ప్రభుత్వానికి మాత్రం తెలియదు.
లోకేష్ ని అడ్డుకుని, అరెస్ట్ చేసి హీరోని చేస్తున్నారు. తాము కష్టపడి వేసిన పప్పు అనే మరకను ఆయనే తుడుస్తున్నారు.