Nara Lokeshసిఎం జగన్మోహన్ రెడ్డి మొన్న బాపట్లలో బటన్ నొక్కి విద్యా దీవెన పధకం కింద రూ. 694 కోట్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “2018-19తో పోలిస్తే మరుసటి సంవత్సరంలో కళాశాలలో చేరినవారి సంఖ్య జాతీయస్థాయిలో కేవలం 3.04 శాతం మాత్రమే కాగా రాష్ట్రంలో 8.64 శాతం పెరిగింది. అమ్మాయిల చదువుల విషయంలో జాతీయ స్థాయిలో 2.28 శాతం మాత్రమే కాగా అదే… మన రాష్ట్రంలో 11.03 శాతం ఉంది. ఈ గణనీయమైన పెరుగుదలకు కారణం మీ జగనన్న అందిస్తున్న విద్యాదీవెన, వసతి దీవెన వంటి పధకాలే,” అంటూ గణాంకాలు చెప్పి భుజాలు చరుచుకొన్నారు.

దీనిపై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ స్పందిస్తూ, “తప్పులైతే గత ప్రభుత్వాలపై నెట్టడం, ఘనత అయితే తమదిగా డబ్బా కొట్టుకోవటం జగన్ రెడ్డికి వ్యసనంగా మారిపోయింది. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వేలో ఏపీ ముందుండటం వైసీపీ ప్రభుత్వ ఘనతే అని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సిగ్గులేకుండా అబద్దాలు ఆడుతున్నారు.

“ఈ సర్వే 1 ఏప్రిల్ 2018 నుంచి 31 మార్చి 2019 వరకు విద్యార్థుల ఉత్తీర్ణత, విద్యా ప్రమాణాలు ఆధారంగా ఈ సర్వే నివేదిక ఇచ్చింది. ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో దేశంలో 3.04 శాతం ఉంటే…ఏపీలో 8. 64 శాతం ఉందంటే ఇది పెరగడానికి కారణం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రాపవుట్స్ తగ్గించేందుకు 2000వ సంవత్సరంలోనే మళ్లీ బడికి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వేలో ఏపీకి వచ్చిన మెరుగైన ఫలితాల్లో 0 శాతం కూడా జగన్ రెడ్డి క్రెడిట్ లేదు. జగన్ రెడ్డి ఇకనైనా ఇతరుల ఘనతని తనది చెప్పుకోవటం అనే వ్యసనం నుంచి బయటపడాలి,” అని ట్వీట్ చేశారు.