స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమానులకు ఆమె కూతురు దగ్గర నుండి పిలుపు వచ్చింది. ఎన్టీఆర్ తనయురాలు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. హెరిటేజ్ సంస్థ బాధ్యతలు నిర్వహించడం తప్ప, సాధారణంగా మీడియాలో ప్రసంగించని భువనేశ్వరి, ఈ నెల 18వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని అభిమానులకు ఓ సందేశాన్నిచ్చారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించిన భువనేశ్వరి… “తెలుగు జాతి కీర్తి, ప్రతిష్టలకు కారణమైన మహనీయుడు నందమూరి తారక రామారావు అని, ఆయన కూతురుగా జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ నేల 18వ తేదీన నిర్వహించబోయే రక్తదాన శిభిరంలో అభిమానులంతా పాలుపంచుకోవాలని, రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని” పిలుపునిచ్చారు.
గతంలో తొమ్మిదేళ్లల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కనీసం మీడియాకు ముఖం చూపించని భువనేశ్వరి, ఇటీవల శంకుస్థాపన, పుష్కరాల ప్రారంభం వంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు. అయితే, తొలిసారిగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారనే సమాచారం అందుకున్న మీడియా వర్గం ఒకింత ఆశ్చర్యాన్ని ప్రదర్శిస్తూ సంచలన విషయాలు ఏమైనా బయటకు వస్తాయోమోనని అంచనా వేసింది. అయితే ఎలాంటి వివాదాలకు, సంచలనాలకు తావు లేకుండా తొలి ప్రెస్ మీట్ తన తండ్రిని ఉద్దేశించి ప్రసంగించారు.