balakrishna-ram-charanచాలా సంవత్సరాల క్రితం ముగిసిన ఓ యుద్ధం మళ్ళీ కొత్త పురుడు పోసుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి రాజకీయ తెరంగ్రేటం తర్వాత వెండితెరకు దూరం కావడంతో… సినిమాల మధ్య నాటి పోటీతత్వం లేక సినీ అభిమానులకు కిక్ పోయినట్లయ్యింది. ముఖ్యంగా ‘మెగా’ వర్సెస్ ‘నందమూరి’ క్యాంప్ మధ్య ఉండే రసవత్తర పోరు, ఇంకా ఏ ఇతర సినిమాల మధ్య ఉండదు. చిరంజీవి ‘ఇంద్ర’ విడుదల చేసి రికార్డులు కొల్లగొడితే, అదే రికార్డులను బద్దలు కొట్టడానికి ‘చెన్నకేశవరెడ్డి’ రూపంలో బాలయ్య వెనువెంటనే వచ్చారంటే… అప్పట్లో ఉన్న మజానే వేరు..! అది అందరి సినీ అభిమానులు కూడా ఈ పోటీ వాతావరణాన్ని ఎంజాయ్ చేసిన రోజులు.

కానీ, చిరు పొలిటికల్ ఎంట్రీ తర్వాత అలాంటి సందడి వాతావరణం ఎక్కడా లేదు. కేవలం రికార్డుల కోసం, కలెక్షన్ల కోసం అభిమానుల చర్చలు, వాదనలు జరుగుతున్నాయి తప్ప, ఒకేసారి పెద్ద హీరోల సినిమాలు విడుదల కావడం లేదు. సినిమాకు సినిమాకు మధ్య ఒకటి, రెండు వారాల గ్యాప్ తో నిర్మాతలు, హీరోలు, దర్శకులు ఒక అవగాహనతో విడుదల చేసుకుని సేఫ్ సైడ్ లో నిలవడం ప్రస్తుత ట్రెండ్ గా మారిపోయింది. అయితే ప్రస్తుతం దానికి బ్రేక్ పడే సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మెగాస్టార్ రీ ఎంట్రీ వైభవమో ఏమో గానీ, ‘మెగా’ వర్సెస్ ‘నందమూరి’ వార్ కు సర్వం సిద్ధమైంది.

అది దసరా నుండే ప్రారంభం కావడం విశేషం. దసరా పండుగను పురస్కరించుకుని బాలకృష్ణ “గౌతమీపుత్ర శాతకర్ణి,” రామ్ చరణ్ “ధృవ” సినిమాల ఫస్ట్ టీజర్లు విడుదలై అభిమానుల ఆదరణను చూరగొన్నాయి. అయితే ఈ రెండు టీజర్లలో ఏది ఆధిపత్యం అన్న దానికి కొలమానంగా మారిన యూ ట్యూబ్ క్లిక్స్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘మెగా’ వర్సెస్ ‘నందమూరి’ వార్ ప్రారంభమైంది. ఈ రెండు టీజర్లు పోటాపోటీగా యూ ట్యూబ్ లో 1 మిలియన్ క్లిక్స్ ను అందుకుంటున్నాయి. అయితే బాలయ్య సినిమా టీజర్ ఓ ఆరు గంటలు ముందు విడుదల కావడంతో తమదే ఆధిపత్యం అంటూ మెగా అభిమానులు సందడి చేస్తున్నారు.

నిజానికి బాలకృష్ణతో పోల్చదగ్గ నటుడు రామ్ చరణ్ కాకపోయినప్పటికీ, ఇక్కడ ‘మెగా – నందమూరి’ హైలైట్ కావడంతో ఈ సైబర్ వార్ కు తెరలేచింది. అయితే నాటి తరం హీరోలలో ఒకరైన బాలయ్య సినిమా కూడా 24 గంటల్లోనే 1 మిలియన్ క్లిక్స్ ను అందుకోవడం సామాన్యమైన విషయమేమీ కాదు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులు రేంజ్ లో అంచనాలు పెంచుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ దసరాకు టీజర్ల మధ్య నెలకొన్న పోటీతత్వం, సంక్రాంతికి అసలు మజాను ఇవ్వబోతోంది. అప్పుడు వెండితెర వేదికగా చిరు వర్సెస్ బాలయ్య తలపడనుండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.