Nandamuri-Balakrishnaప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో టిడిపి అధ్వర్యంలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించారు.

“జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇస్తే మూడేళ్ళుగా ఛార్జీలు, పన్నులు పెంచుతూ సామాన్య ప్రజలపై భారం వేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలు బ్రతకడం చాలా కష్టమైపోతోంది. అయినా వారిపై నానాటికీ భారం పెంచుతూనే ఉన్నారు. మూడేళ్ళలో అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని ముంచేశారు. జగన్ చేతకానితనం వలననే నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఇంత దుస్థితిలో ఉంది.

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ని ప్రజలు ఎంతో నమ్మకంగా ఓట్లేసి గెలిపిస్తే ఆయన ప్రజలకు నీలిచిత్రాలు చూపించారు. పైగా సిగ్గులేకుండా హిందూపురంలో జెండా ఎగురవేశారు. ఆయన రాష్ట్రం పరువు తీస్తే, జగన్ ప్రభుత్వం ఆయనపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఆయన చేసిన వెదవపనిని ప్రభుత్వం కూడా సమర్ధిస్తున్నట్లే కదా? ఇటువంటి ప్రభుత్వాన్ని, పార్టీని, నేతలని ప్రజలు తరిమి తరిమి కొట్టాలి. వారి వలన ప్రజలకు, రాష్ట్రానికి కూడా చెడ్డపేరు వస్తోంది,” అని అన్నారు.

తమ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వచ్చాడని టిడిపి కార్యకర్తలు, తమ అభిమాన నటుడు వచ్చాడని అభిమానులు భారీ సంక్ష్యలో ఈ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. అడుగడుగునా ఆయనకు నీరాజనాలు పడుతూ జై బాలయ్య అంటూ ఉత్సాహంగా నినాదాలు చేశారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ అప్పుడే ఎన్నికల సన్నాహాలు ప్రారంభించేసింది. కనుక నందమూరి బాలకృష్ణ కూడా తన సినిమాలను పూర్తిచేసి వీలైనంత త్వరగా టిడిపి తరపున ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటే మంచిది.