నటసింహ నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ సినిమా ‘సింహా’ లో యాగం ఫైట్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ‘యాగం ఆగదు… వారసుడు ఉన్నాడు,’ అనే డైలాగ్ చెప్పి బాలయ్య ముష్కరులను ఇరగదీస్తాడు. ఆ ఫైట్ ఆ చిత్రానికే హైలైట్. ఇప్పుడు అటువంటి యాగం ఫైట్ ఒకటి బాలకృష్ణ తదుపరి చిత్రంలో కూడా ఉంటుందట. తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని ఆ ఫైట్ ను ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు.
సింహా సెంటిమెంట్ కలిసొస్తే బాలయ్య ఖాతాలో ఇంకో హిట్ పక్కా అని కొందరు అభిమానులు సంబరపడిపోతున్నారు. ఫైట్ మాస్టర్లు అన్బు, అరవి నేతృత్వంలో ఆ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. వారికి ఇటీవలే కేజీఎఫ్ తో నేషనల్ అవార్డు వచ్చింది. ప్రకాష్రాజ్, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చిరంతన్ భట్. సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ చిత్రబృందం క్రిస్మస్ విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
బాలయ్య, కేఎస్ రవికుమార్ మొన్న ఆ మధ్య జయసింహ అనే సినిమా చేశారు. ఆ సినిమా లో పెద్దగా విషయం లేకపోయినా సంక్రాంతి సెలవుల వల్ల ఆడింది. అయినా అటువంటి దర్శకుడికి మళ్ళీ అవకాశం ఇచ్చారు. దీనితో సినిమాపై అభిమానులకు ఒకింత అనుమానంగానే ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండు భాగాలు ప్లాప్ గా మిగిలిపోవడంతో నందమూరి అభిమానులు ఒకింత నిరాశగా ఉన్నారు. మరి ఈ సినిమాతో వారికి ఏం రాసిపెట్టి ఉందొ చూడాలి.