Nanadamuri-Balakrishna-Sorry-To-Nursesనందమూరి బాలకృష్ణకి ఎంత మంచి పేరున్నా… ఎంతమంది అభిమానులు ఉన్నా అప్పుడప్పుడు నోరుజారుతూ లేదా చెయ్యి విసురుతూ వివాదాలలో చిక్కుకొని విమర్శల పాలవుతుంటారు. ఆ తర్వాత వారికి సోషల్ మీడియాలోనో మరో వేదిక మీదనో క్షమాపణలు చెప్పుకోవడం బాలయ్యకి పరిపాటిగా మారిపోయింది.

ఇటీవల వీరసింహారెడ్డి సక్సస్ మీట్‌లో “అక్కినేని తొక్కినేని” అంటూ నోరుజారి విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్‌ షోలో తనకి ఓసారి ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్‌కి వెళితే అంటూ మొదలుపెట్టి “ ఆ నర్సు చాలా అందంగా ఉంది…” అంటూ బాలయ్య అనుచిత వ్యాఖ్య చేశారు.

బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై హైదరాబాద్‌లోని నీమ్స్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న నర్సులు తీవ్ర నిరసన తెలిపారు. బాలయ్య తక్షణం తన వ్యాఖ్యలని ఉపసంహరించుకొని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.

ఈ విషయం బాలయ్య చెవిన పడటంతో ఆయన వెంటనే, “అందరికీ నమస్కారం. నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా మాటలను కావాలనే వక్రీకరించారు. రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సేవలు చేసి సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతోమంది నర్సులు రాత్రనక, పగలనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకుని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా’’ అని సోషల్ మీడియాలో పశ్చాతాపం వ్యక్తం చేస్తూ ఓ సందేశం పెట్టారు.