Nanadamuri balakrishna invites KCR for gauthamiputra sathakarni movie launchనందమూరి నటసింహం తన 100వ చిత్రానికి సంబంధించిన “గౌతమిపుత్ర శాతకర్ణి” కధ చారిత్రాత్మకమైన అంశంతో కూడుకున్నది కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకతను సంతరించుకుంది. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకను ఈ నెల 22వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. ఎంత వైభవంగా అంటే… ఈ ప్రారంభోత్సవ వేడుక కోసం ఒక పెళ్లి కార్డు మాదిరి ఒక ఆహ్వానపత్రికను కూడా ముద్రించి పంచి పెడుతున్నారు. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయేలా రూపుదిద్దుకోవడంతోనే ఈ ప్రారంభోత్సవ వేడుకను ఇంత ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.

ఈ ఆహ్వాన పత్రికను తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేసారు బాలకృష్ణ. దర్శకుడు క్రిష్ తో కలిసి సిఎం క్యాంపు ఆఫీస్ లో కేసీఆర్ ను కలిసిన బాలకృష్ణ, ఈ నెల 22వ తేదీన చిత్ర ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా కోరారు. దీనికి కేసీఆర్ కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అమరావతి చరిత్ర ఉన్న ఈ సినిమా కధలో బాలకృష్ణ బావ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు రావడం లాంఛన ప్రాయమే. దీంతో మరోసారి ఇద్దరు ‘చంద్రుల’ను కలిపిన ఘనత బాలకృష్ణ సొంతం చేసుకోనున్నారు.

చంద్రబాబు రాకపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు గానీ, ఒక చారిత్రాత్మక చిత్రం కావడంతో ఖచ్చితంగా హాజరవుతారని సినీ, రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇద్దరు ‘చంద్రుల’కు తోడు సినీరంగ అతిరధ మహారధులు బాలకృష్ణ 100వ సినిమా “గౌతమిపుత్ర శాతకర్ణి”ని ఆశీర్వదించడానికి విచ్చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను క్రిష్ తన స్వీయ నిర్మాణ పర్యవేక్షణలో తెరకెక్కిస్తున్నారు.