తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కువ గనుక, ఆ స్థానాన్ని మొదట కాంగ్రెస్ పార్టీ, తర్వాత టిడిపి, వైఎసార్ కాంగ్రెస్ పార్టీలు గెలుచుకొన్నాయి. 2014, రాష్ట్ర విభజన సమయంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో అనపర్తి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి గెలుచుకొన్నారు. కానీ 2019 ఎన్నికలలో వైసీపీ ప్రభంజనంలో వైసీపీకి చెందిన డాక్టర్ రామకృష్ణారెడ్డి సతి అనపర్తిలో గెలుపొందారు.
ఆ ఎన్నికలలో ఓడిపోయిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఏమాత్రం నిరాశ చెందకుండా, నిత్యం ప్రజల మద్య వారికి అందుబాటులో ఉంటూ అనేక కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు.
ఈ మూడున్నరేళ్ళ జగన్ పాలనలో ఓ పక్క నానాటికీ అప్పులు, ఛార్జీలు, పన్నులు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతుంటే, మరోపక్క వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు, లోపభూయిష్టమైన విధానాలు, అవినీతి, అక్రమాలు, అరాచకాలు కూడా పెరిగిపోతున్నాయి. వీటిపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి నేతృత్వంలో అనపర్తిలో టిడిపి శ్రేణులు నిరంతర పోరాటాలు చేస్తూనే ఉన్నాయి.
కనుక ఈసారి మళ్ళీ అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి గెలిచి టిడిపి జెండా ఎగురవేయడం ఖాయమనే అభిప్రాయం నియోజకవర్గంలో సర్వత్రా వినబడుతోంది.