Nallari Kiran Kumar Reddyఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చే వారం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆయనను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఊమెన్ చాందీ స్వయంగా కలిసి చర్చలు జరిపారు. ఈ నెల 13న ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

పార్టీలో చేరేముందు ఆయన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను కలవనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రేపో మాపో ఆయన దిల్లీకి వెళ్లనున్నారట. 13న కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని..దిల్లీలో రాహుల్‌ సమక్షంలో పార్టీ కండువ కప్పుకుంటారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు రాహుల్‌గాంధీ నల్లారికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం.

అయితే కాంగ్రెస్‌ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన సంకేతాలు పంపడం, కాంగ్రెస్ గంపెడు ఆశలతో ఇటువంటి లీకులు ఇవ్వడం జరుగుతూ ఉండగానే కాంగ్రెస్ లో చేరే విషయమై తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కిరణ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. ఇలాంటి వార్తలు తాను టీవీ ఛానళ్లలోనే చూస్తున్నానని చెబుతున్నారు. ఇటువంటి సందర్భాలు ఈ మధ్యలో రెండు సార్లు జరగడం విశేషం.